అమెరికాలో అధికార బదిలీ ప్రక్రియ ఆరంభం: వైట్ హౌస్, కానీ, ట్రంప్కే మద్దతుగా అధికారులు
వాషింగ్టన్: ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్ ఘన విజయం సాధించినప్పటికీ.. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఓటమిని అంగీకరించడం లేదు. రిగ్గింగ్ చేసి గెలిచారంటూ జో బైడెన్పై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్కు అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది.
Recommended Video
అధికార బదిలీకి యంత్రాంగం ఏర్పాట్లు..
అధికార బదిలీ చేయాల్సిన అవసరం ఏర్పడితే అందుకు చట్ట ప్రకారం చేయాల్సిన అన్ని పనులను చేస్తున్నామని వైట్ హౌస్లో ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న ట్రంప్ అధికార యంత్రాంగం ప్రకటించింది. అయితే, ఎన్నికల ఫలితాలపై ట్రంప్ వాదనను సమర్థించారు వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ క్యాలీ మెక్ ఎగనా. బైడెన్ గెలిచినట్లు గుర్తించడం లేదన్నారు.
ట్రంప్కే వైట్హౌస్ కీలక అధికారుల మద్దతు
అధ్యక్షుడు ట్రంప్ చాలా స్పష్టతతో ఉన్నారని, చట్టబద్ధమైన ప్రతి ఒక్క ఓటునూ లెక్కించాలని కోరుతున్నారని చెప్పారు. ట్రంప్ చెబుతున్నవన్నీ వాస్తవాలేనని క్యాలీ మెక్ అన్నారు. ట్రంప్ ఓటమిని ఎప్పుడు అంగీకరిస్తారని మీడియా ప్రశ్నించగా.. సమాధానం చెప్పలేదు. అయితే, ఓట్ల లెక్కింపుపై వివాదం కొనసాగుతున్నప్పటికీ అధ్యక్ష మార్పిడి చట్టం (ప్రెసిడెన్షియల్ ట్రాన్సిషన్ యాక్ట్) ప్రకారం పాటించాల్సిన ప్రక్రియను మొదలుపెట్టామని చెప్పారు. అధికార యంత్రాంగం చేయాల్సిన పనులను చేస్తున్నామన్నారు.
తగిన సమయంలోనే అధికార మార్పిడి..
ఎన్నికల ఫలితాలపై అధికారిక ధృవీకరణ పత్రాలు ఇంకా అందకపోవడంతో అధికార మార్పిడిని పర్యవేక్షించాల్సిన జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్ విభాగం కూడా స్పందించడం లేదు. జో బైడెన్ విజయం సాధించినట్లు ఆ విభాగం అడ్మినిస్ట్రేటర్ ఎమిలీ మర్ఫీ ఇంతవరకు గుర్తించలేదని, తగిన సమయంలో ఈ గుర్తింపు వస్తుందన్నారు. విస్కాన్సిన్ రాష్ట్రంలోని డేన్, మిల్వాకీ కౌంటీల్లో ఓట్ల తిరిగి లెక్కింపు శుక్రవారం ప్రారంభమైంది. ఈ రెండూ కూడా డెమొక్రాట్లకు కంచుకోటల్లాంటివి కావడంతో ఇక్కడ పోలైన వేలాది పోస్టల్ బ్యాలెట్లను రద్దు చేయాలంటూ ట్రంప్ తరపున రిపబ్లికన్ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఎన్నికల సంఘం ఇందుకు నిరాకరించింది. చట్ట ప్రకారమే ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టం చేసింది.
ప్రభుత్వ ఏర్పాటు దిశగా జో బైడెన్..
ట్రంప్ వాదన ఎలా ఉన్నా.. ఎన్నికల్లో గెలిచిన జో బైడెన్ మాత్రం ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకు సాగుతున్నారు. పార్టీ నేతలతో ఉన్నతస్థాయి సమావేశాలు నిర్వహిస్తున్నారు. 15 మందితో మంత్రివర్గం ఏర్పాటు చేసేందుకు కసరత్తులు మొదలు పెట్టారు. అయితే, ఆశావాహులు ఎక్కువగా ఉండటంతో జో బైడెన్కు ఇదో కొత్త తలనొప్పిగా మారుతోంది.