హిల్లరీకి డబ్బులు: భారత్పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
వాషింగ్టన్: రిపబ్లికన్ పార్టీ తరుపున అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ తన ప్రత్యర్ధి, డెమొక్రాటిక్ పార్టీ తరుపున అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం ఆయన న్యూయార్క్లోని ఎన్నికల ప్రచార సభలో హిల్లరీ ఫ్యామిలీ ఫౌండేషన్కు వస్తున్న నిధులపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
ఇండియా-యుఎస్ పౌర అణు ఒప్పందానికి అనుకూలంగా ఓటు వేసేందుకు గాను భారత్లోని రాజకీయ నాయకులు, సంస్ధల నుంచి ఆమె నిధులు స్వీకరించినట్లు ట్రంప్ ఆరోపించారు. ఈ మేరకు హిల్లరీ క్లింటన్పై 50 పేజీలతో కూడిన ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. ఆ పుస్తకంలో ఈ ఆరోపణలున్నాయి.
అయితే హిల్లరీపై చేసిన ఈ ఆరోపణలు కొత్తవేమీ కాదు, గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆరోపణలు హిల్లరీపై వస్తూనే ఉన్నాయి. వాటిని ఆమె తోసిపుచ్చుతూనే ఉన్నారు. అయితే తాజాగా ట్రంప్ విడుదల చేసిన ఈ పుస్తకంలోని ఆరోపణల్లో 'న్యూయార్క్ టైమ్స్' కథనాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు.
2008లో పర్యటించిన ప్రముఖ రాజకీయ నాయకుడు అమర్ సింగ్ క్లింటన్ ఫౌండేషన్కు దాదాపు 10 లక్షల డాలర్లు విరాళం ఇచ్చారని పేర్కొన్నారు. అమర్ సింగ్ 2008 సెప్టెంబరులో అమెరికాలో పర్యటించారని, భారతదేశం పౌర అణు సాంకేతిక పరిజ్ఞానం పొందడానికి వీలుగా ఒప్పందానికి మద్దతివ్వాలని కోరారని తెలిపారు.
అప్పుడు సెనేటర్గా ఉన్న హిల్లరీ క్లింటన్ ఈ ఒప్పందానికి మద్దతు ప్రకటించారని, డెమొక్రాట్లు కూడా దీనిని అడ్డుకోరని ఆమె హామీ ఇచ్చారని పుస్తకంలో పేర్కొన్నారు. మొత్తంగా చూస్తే 2008లో కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ క్లింటన్ ఫౌండేషన్కు 10 లక్షల డాలర్ల విరాళాన్ని ఇచ్చిందని వివరించారు.
హిల్లరీపై ఒత్తిడి రావడంతో ఇండియన్-అమెరికన్ రాజ్ ఫెర్నాండోను హోంశాఖ అంతర్జాతీయ భద్రతా సలహా మండలి సభ్యునిగా నియమించారని పేర్కొన్నారు. ఫెర్నాండో దాదాపు 50 లక్షల డాలర్లు విరాళం ఇచ్చారని ఆరోపించారు. హిల్లరీ విదేశాంగ విధానం వల్ల వేలాది మంది అమెరికన్ల జీవితాలను నాశనం చేయడంతో పాటు ఐఎస్ విస్తరించిందని ట్రంప్ ఆరోపించారు.