ట్రంప్ నోట.. ఎవరూ ఊహించని మాట! ముస్లింలపై తొలిసారి..
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్ష ఎన్నికల ముందు.. సందర్బం వచ్చిన ప్రతీసారి దేశంలోని ముస్లింలపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు ట్రంప్. అయితే అధ్యక్ష పీఠం ఖరారైపోయిన తర్వాత.. ఆ సీన్ పూర్తి రివర్స్ గా మారిపోయినట్టే కనిపిస్తోంది. అందుకు తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలే నిదర్శనం.
గతంలో ముస్లింల పట్ల కర్కషంగా వ్యవహరించిన ట్రంప్.. తాజాగా వారి పట్ల జాలి చూపించడం గమనార్హం. ఓ టీవి చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్బంగా.. ముస్లింల గురించి ప్రస్తావిస్తూ.. 'ముస్లింలపై వేధింపులు చోటు చేసుకుంటున్నాయన్న విషయం నన్నెంతగానో బాధిస్తుంది. దయచేసి ఇక అలాంటి చర్యలకు ఫుల్ స్టాప్ పెట్టండి' అంటూ వ్యాఖ్యానించారు. ఒక్క ముస్లింల పైనే గాక ఆఫ్రికన్, అమెరికన్, లాటిన్ అమెరికన్లపై సాగుతున్న వేధింపుల పర్వాన్ని వెంటనే ఆపేయాలని సూచించారు.
ఒకవేళ అలాంటి చర్యలు దేశానికి ఉపయోగపడుతాయంటే వాటికి మద్దతిస్తానని, కానీ అలాంటి పోకడలు సరికానందువల్ల వెంటనే అలాంటి చర్యలకు ఫుల్ స్టాప్ పెట్టేయాలని చెప్పారు ట్రంప్. ఇదే ఇంటర్వ్యూలో.. తనను చూసి భయపడుతోన్న అమెరికన్లకు అలాంటి భయాలేవి అవసరం లేదని భరోసా ఇచ్చారు.
ఇక తన గెలుపును నిరసిస్తున్న హిల్లరీ మద్దతుదారులపై పలు విమర్శలు చేశారు ట్రంప్. ఆందోళన చేస్తున్నవారిలో ప్రొఫెషనల్ ఆందోళనకారులు కూడా ఉన్నారని ఆరోపించారు. అయితే ఇదంతా సహజమేనని, ఒకవేళ హిల్లరీ గెలిచి ఉంటే తన మద్దతుదారులు కూడా ఇలాగే ఆందోళన చేసేవారని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికాకు గత వైభవాన్ని తీసుకొచ్చేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తానని హామి ఇచ్చారు.
మొత్తానికి ట్రంప్ తాజా కామెంట్స్ ను పరిశీలిస్తే.. అధ్యక్షుడయ్యాక ముస్లింల పట్ల ట్రంప్ వైఖరిలో మార్పు వచ్చిందా? అన్న అభిప్రాయం కలగమానదు.