ట్రంప్-బిడెన్ మధ్య చర్చ: భారత్పై నిందవేసిన అమెరికా అధ్యక్షుడు..భారతీయుల ఓట్లు దక్కేనా..!
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా ఇటు రిపబ్లిక్ అభ్యర్థి ప్రస్తుత అధ్యక్ష్యుడు డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాటిక్ అభ్యర్థి జోబిడెన్ల మధ్య తొలి డిబేట్ జరిగింది. అధ్యక్ష ఎన్నికలకు ముందు రెండు ప్రధాన అభ్యర్థుల మధ్య డిబేట్ జరగడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే బుధవారం డిబేట్ చాలా హాట్గా నడిచింది. ఇద్దరు అభ్యర్థులు ఒకరిపై ఒకరు నిప్పులు చెరిగారు. ఇక ఇంత కాలం భారత్తో చాలా స్నేహపూర్వకంగా మెలిగిన అధ్యక్షుడు ట్రంప్ ఒక్కసారిగా బాంబు పేల్చారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలను అక్కడి భారతీయులు ఏవిధంగా తీసుకుంటారనేదానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.
కరోనావైరస్పై చర్చ
అమెరికా అధ్యక్ష పదవికోసం నవంబర్ నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో భాగంగా అధ్యక్ష అభ్యర్థులైన ట్రంప్-బిడెన్ల మధ్య హాట్ డిబేట్ జరిగింది. ఈ క్రమంలోనే కరోనావైరస్ టాపిక్పై చర్చ జరిగింది. ఇద్దరి మధ్య జరిగిన వాదనల్లో అధ్యక్షుడు ట్రంప్ రెండు సార్లు భారత్ పేరు ప్రస్తావించారు. అయితే రెండు సార్లు కూడా భారత్ను కించపరిచేలానే మాట్లాడారు. టాపిక్ కరోనావైరస్ పై జరిగినప్పుడు డొనాల్డ్ ట్రంప్ విఫలమయ్యారని జోబిడెన్ అన్నారు. ప్రపంచ దేశాల్లోనే అమెరికా కరోనావైరస్ కేసుల్లో అగ్రస్థానంలో ఉందని..కట్టడి చేయడంలో ట్రంప్ ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. జోబిడెన్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ట్రంప్.. నిందను భారత్ చైనాలపై వేశారు.
భారత్ చైనా దేశాలు తప్పుడు లెక్కలు చెబుతున్నాయి
కరోనా మరణాలపై ట్రంప్ మాట్లాడుతూ.. కరోనా వల్ల భారత్లో ఎంతమంది మరణించారో తెలుసా? అని జో బిడెన్ను ప్రశ్నించారు. భారత్ సహా చైనా, రష్యా కరోనా మరణాలపై వాస్తవ లెక్కలను వెల్లడించట్లేదని చెప్పారు. డెమొక్రాట్ల ప్రభుత్వ హయాంలో స్వైన్ఫ్లూ బారిన పడి చాలా మంది మరణించారని, అప్పుడు వారేం చేశారని ప్రశ్నించారు. హెచ్1 ఎన్1 వైరస్కు ఎంతోమంది మరణించారని చెప్పారు. ఇక ఇదే మంచి సమయంగా భావించిన ట్రంప్...కరోనావైరస్కు కారణం డ్రాగన్ కంట్రీనే అని అన్నారు. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మంది చనిపోయారంటే ఇందుకు కారణం చైనానే అని గట్టిగా చెప్పారు ట్రంప్. ఇక కరోనావైరస్ బారిన పడి చాలా అమెరికా కుటుంబాలు తమ కుటుంబ సభ్యులను కోల్పోయారని బిడెన్ చెప్పగా ... ఇందుకు కారణం చైనానే అని మరోసారి ట్రంప్ నొక్కిఒక్కానించారు.
Recommended Video
వాతావరణంలో మార్పులకు భారత్ కారణమట
ట్రంప్ చాలా బాధ్యతారాహిత్యంతో వ్యవహరించారని అతనో మూర్ఖుడని బిడెన్ అన్నారు. తన ఆరోగ్యంను కాపాడుకునేందుకు మాత్రమే ట్రంప్ ఆసక్తి చూపుతున్నారని విమర్శలు సంధించారు. ఇక మరో సందర్భంలో వాతావరణంపై చర్చ జరిగింది. ఇక్కడ కూడా ట్రంప్ భారత్పై నింద వేశారు. వాతావరణంలో మార్పులు వస్తున్నాయంటే ఇందుకు కారణం చైనానే అని మండిపడ్డారు. చైనా గాల్లోకి విషవాయువులు విడుదల చేస్తోందని మండిపడ్డారు ట్రంప్. అదే సమయంలో రష్యా, భారత్లు కూడా కాలుష్యం వెదజల్లుతున్నాయని అన్నారు.
మొత్తానికి ట్రంప్ భారత్ పై చేసిన వ్యాఖ్యలతో అక్కడ సెటిల్ అయిన భారతీయుల ఓట్లు పొందడం చాలా కష్టమే అని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.