అందుకే తప్పుకున్నాం, మనకు నష్టం: భారత్-చైనాలపై ట్రంప్ ఆగ్రహం
వాషింగ్టన్: ప్యారిస్ వాతవరణ ఒప్పందం నుంచి వైదొలగాలన్న తమ నిర్ణయానికి భారత్, చైనాలో కారణమని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. ఆ ఒప్పందం పక్షపాతపూరితంగా ఉందని మండిపడ్డారు.
ప్యారిస్ ఒప్పందం నుంచి తాము (అమెరికా) వైదొలుగుతున్నట్లు డొనాల్డ్ ట్రంప్ గత ఏడాది జూన్లో ప్రకటించారు. తాజాగా కన్జర్వేటివ్ రాజకీయ కార్యాచరణ కమిటీని ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడారు.
ప్యారిస్ ఒప్పందాన్ని పక్కన పెట్టేశామని, అది మనకు పెద్ద నష్టదాయకంగా మారిందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మన వద్ద భారీ చమురు, గ్యాస్, బొగ్గు నిల్వలు ఉన్నాయని, వాటిని వాడొద్దని ప్యారిస్ ఒప్పందం చెబుతోందన్నారు.
అమెరికా పోటీతత్వం దెబ్బతింటుంది
దీని వల్ల మిగతా దేశాలతో అమెరికా పోటీతత్వం దెబ్బతింటుందని ట్రంప్ అన్నారు. అలా జరగబోదని తాను చెప్పానని, చైనా విషయానికి వస్తే వారి ఒప్పందం 2030 వరకూ ప్రారంభం కాదన్నారు.
మన ఒప్పందం తక్షణమే ప్రారంభం
మన ఒప్పందం మాత్రం తక్షణమే ప్రారంభమవుతుందని ట్రంప్ చెప్పారు. రష్యాకు కూడా మినహాయింపులు ఇచ్చారని, భారత్ వంటి పెద్ద దేశాలకు మనం చెల్లింపులు చేయాల్సి ఉంటుందని చెప్పారు.
మనం డబ్బు కట్టాలని చెబుతున్నారు
భారత్, చైనాలను అభివృద్ధి చెందుతున్న దేశాలని చెబుతున్నారని, అమెరికా మాత్రం అభివృద్ధి చెందిన దేశమని అంటున్నారని, అందువల్ల మనం డబ్బు కట్టాలని చెబుతున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు.
దెబ్బతింటుంది
ప్యారిస్ ఒప్పందం వల్ల అమెరికాకు ట్రిలియన్ల కొద్ది డాలర్ల నష్టం జరుగుతుందని ట్రంప్ అన్నారు. తయారీరంగం దెబ్బతింటుందన్నారు. ఈ ఒప్పందం వల్ల భారత్, చైనాలు ఎక్కువగా లబ్ధి పొందుతాయన్నారు.
చైనాతో సంబంధాలు మెరుగయ్యాయి కానీ
చైనాతో ఇటీవల కాలంలో సంబంధాలు మెరుగయ్యాయని ట్రంప్ చెప్పారు. అదే సందర్భంలో చైనా అమెరికా వాణిజ్యాన్ని దెబ్బతీస్తుండటం వల్ల ఇరు దేశాల మధ్య సంబంధాలు పక్కదారి పట్టే ప్రమాదముందన్నారు. చైనాపై కఠినమైన టారిఫ్లను విధించేందుకు వెనుకాడబోమన్నారు.