క్రూరమైన నియంత చనిపోయాడు: పిడెల్ క్యాస్ట్రోపై ట్రంప్
అస్తమించిన క్యూబా విప్లవ నేత ఫిడేల్ క్యాస్ట్రో పైన అమెరికా తదుపరి అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
వాషింగ్టన్: అస్తమించిన క్యూబా విప్లవ నేత ఫిడేల్ క్యాస్ట్రో పైన అమెరికా తదుపరి అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. క్యాస్ట్రో క్రూర నియంత అని ఆయన అభివర్ణించారు. క్యాస్ట్రో మరణ వార్త తెలియగానే ట్రంప్ స్పందించారు.
క్యాస్ట్రో వల్ల కలిగిన బాధలు, ప్రాణ నష్టాలు, విషాదాలను మరిచిపోలేమన్నారు. ఇప్పటికీ క్యూబా నియంతృత్వంలో మగ్గుతుండటం శోయనీయమని వ్యాఖ్యానించారు. నేటితో ఏళ్లుగా వెంటాడిన భయాలు పోయి క్యూబావాసులు స్వేచ్ఛ వైపు అడుగులు వేయాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.
దీనికి కావాల్సిన చర్యలన్నీ తమ ప్రభుత్వం తీసుకుంటుందని ట్రంప్ వ్యాఖ్యానించారు. సొంత ప్రజలను అరవై ఏళ్ల పాటు అణిచివేశారని మండిపడ్డారు. ట్రంప్ తొలుత.. 'ఫిడేల్ క్యాస్ట్రో మరణించార'ని ఎలాంటి ఉద్వేగం లేకుండా ట్వీట్ చేశారు.
ఆ తర్వాత క్రూర నియంతగా, సొంత ప్రజల్లో ఆరు దశాబ్దాలుగా అణిచివేసారని పేర్కొన్నారు. ఆయన హయాంలో ప్రజలు వర్ణనాతీతమైన బాధలు అనుభవించారని, పేదరికం తాండవించిందని, పౌరులు తమ ప్రాథమిక మానవ హక్కులను కోల్పోయారని అన్నారు. అభివృద్ధి, స్వేచ్ఛ దిశగా క్యూబా ప్రజలకు తాము సహకరిస్తామన్నారు.
తదుపరి ఉపాధ్యక్షులు మైక్ పెన్స్ కూడా క్యాస్ట్రో మరణంపై స్పందించారు. క్రూరుడైన క్యాస్ట్రో మరణించాడని, క్యూబాలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయన్నారు. అణచివేతకు గురైన అక్కడి ప్రజల వెనుక తాము నిలబడతామన్నారు. వారిని ప్రజాస్వామ్యం వైపు తీసుకెళ్తామని ఆయన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా, క్యాస్ట్రో మృతిపై అధ్యక్షుడు బరాక్ ఒబామా సంతాపం తెలిపారు. ఇది క్యూబావాసులకు తీవ్ర దుఃఖ సమయమని, ప్రజల జీవితాలపై క్యాస్ట్రో చెరగని ముద్ర వేశారని, చరిత్ర ఆయనను గుర్తు పెట్టుకుంటుందన్నారు. క్యూబావాసులకు తాము స్నేహ హస్తాన్ని అందిస్తున్నామని ఒబామా చెప్పారు.