భారత ఐటీకి ట్రంప్ భారీ షాక్: హెచ్1బీ వీసా నిబంధనల మార్పు ఫైల్పై సంతకం
భారత ఐటీ రంగానికి అమెరికా మరోసారి భారీ షాకిచ్చింది. విదేశీయులు అమెరికాలో పని చేసేందుకు వీలుగా జారీ చేసే వీసా నిబంధనల్లో మార్పులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు.
వాషింగ్టన్: భారత ఐటీ రంగానికి అమెరికా మరోసారి భారీ షాకిచ్చింది. విదేశీయులు అమెరికాలో పని చేసేందుకు వీలుగా జారీ చేసే వీసా నిబంధనల్లో మార్పులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఉద్యోగాల్లో అమెకన్లనే నియమించుకోవాలని ట్రంప్ స్పష్టం చేశారు.
భారత టెక్కీలపై పెను ప్రభావం
తాజా నిర్ణయం భారతీయ వృత్తి నిపుణుల(టెక్కీల)పై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీని ప్రకారం అమెరికాకు అత్యున్నత నైపుణ్యం ఉన్నవారే వస్తారని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఉద్యోగాల కోసం అమెరికాలోకి రాకపోకలు సాగించే వారిపై గట్టి నిఘా ఉండనుంది. అంతేగాక, అత్యధిక వేతనం.. అత్యధిక ఉపాధి కల్పించాలన్న తన లక్ష్యం నెరవేరుతుందని ట్రంప్ కార్యవర్గం భావిస్తోంది.
అమెరికాకు మేలే
ట్రంప్ పదవీబాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే ఫస్ట్ అమెరికా నినాదాన్ని అమలు చేశారు. ఈ నిర్ణయంతో ఫెడరల్ కాంట్రాక్ట్లు కూడా అమెరికా సంస్థలకే వచ్చే అవకాశం ఉంది. ఇది దేశ ఆర్థిక వ్వవస్థకు కూడా ఊతం ఇస్తుందని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది
నైపుణ్యం ఉంటేనే..
అత్యుత్తమ నైపుణ్యం ఉన్నవారికే హెచ్1బీ వీసాలు ఇవ్వాలనే ఫెడరల్ శాఖలు ఈ నిబంధనలను సూచించాయి. వీటిని ప్రత్యేక విధులకే మాత్రమే కేటాయిస్తారు. వీటిల్లో కూడా యూఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారం ఉన్నత విద్యాభ్యాసం చేసి ఉండాలి. శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, కంప్యూటర్ ప్రోగ్రామర్లకు మాత్రం ఎలాంటి పరిమితి లేదు. 65 వేల వీసాలు జారీ చేయడానికి ప్రభుత్వం లాటరీ విధానాన్ని ఎన్నుకుంది. మరో 20వేల వీసాలను గ్రాడ్యుయేట్ స్టూడెంట్ వర్కర్లకు కేటాయించనున్నారు.
తగ్గిన దరఖాస్తులు
కాగా, ట్రంప్ కఠిన నిర్ణయాల నేపథ్యంలో ఈ సంవత్సరం హెచ్1బీ వీసాలకు దరఖాస్తుల సంఖ్య భారీగా పడిపోయింది. నిరుడు 2,36,000 ఉండగా.. ఈ సారి 1,99,000లకు మాత్రమే పరిమితమైంది. అత్యుత్తమ నైపుణ్యాలు ఉన్న వారిని నియమించుకోవడానికే హెచ్1బీ వీసాలను వినియోగిస్తామని కంపెనీలు కూడా స్పష్టం చేస్తుండటం గమనార్హం.