అమెరికాలో దీపావళి వేడుకలు.. పాల్గొన్న ట్రంప్, ఇవాంకా
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. శ్వేతసౌధంలోని ఓవల్ ఆఫీస్లో ట్రంప్.. భారత అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ సభ్యులతో కలిసి దీపాలను వెలిగిం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. శ్వేతసౌధంలోని ఓవల్ ఆఫీస్లో ట్రంప్.. భారత అమెరికన్ అడ్మినిస్ట్రేషన్ సభ్యులతో కలిసి దీపాలను వెలిగించిన ఆయన అధికారులతో కాసేపు సరదాగా ముచ్చటించారు.
ఈ వేడుకల్లో ఐక్యరాజ్యసమితికి అమెరికా రాయబారి అయిన నిక్కీ హేలీ, సెంటర్ ఫర్ మెడికేర్ అడ్మినిస్ట్రేటర్ సీమా వర్మ, యూఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ ఛైర్మన్ అజిత్ పాయ్ తదితర భారత అమెరికన్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వేడుకలకు సంబంధించిన వీడియోను ట్రంప్ తన ఫేస్బుక్ ఖాతా ద్వారా పంచుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. భారత-అమెరికన్ కమ్యూనిటీతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొనడం చాలా గర్వంగా ఉన్నట్లు చెప్పారు.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని నిర్మించిన గొప్ప ప్రజలు భారతీయులని, ఆ దేశ ప్రధాని మోడీతో ఉన్న బలమైన సంబంధాలకు తాను చాలా విలువిస్తున్నానని, మన భారత-అమెరికన్ సోదరులు, మిత్రులు అమెరికా ఉన్నతి కోసం ఎంతో కృషి చేస్తున్నారని ట్రంప్ అన్నారు.
అమెరికాలోని సైన్యంలో పనిచేస్తున్న భారత పౌరులకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పీపుల్స్ హౌస్లో దీపావళి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందంటూ.. అమెరికాలో ఉండే ప్రతి ఒక్కరికీ, హిందువులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ట్రంప్ చెప్పారు.
మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్ తొలిసారిగా శ్వేతసౌధంలో దీపావళి వేడుకలు నిర్వహించారు. అయితే ఆయన స్వయంగా ఈ వేడుకల్లో పాల్గొనలేదు. ఆ తర్వాత అధ్యక్షుడిగా ఎన్నికైన ఒబామా స్వయంగా సంబరాల్లో పాల్గొని దీపాలను వెలిగించారు.