దలైలామా వారసుడు: చైనా హెచ్చరికలు బేఖాతరు, ఆ బిల్లుపై డొనాల్డ్ ట్రంప్ సంతకం
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి చైనాకు షాకిచ్చారు. చైనా జోక్యం లేకుండా అంతర్జాతీయ సహకారంతో టిబెట్ బౌద్ధ కమ్యూనిటీ తమ దలైలామా వారసుడిని ఎన్నుకునే వీలు కల్పించే బిల్లును అమెరికా ఇప్పటికే ఆమోదించింది.
టిబెట్.. తమ దలైలామా తదుపరి వారసుడిని ఎన్నుకోవడంతోపాటు ఇతర కార్యక్రమాల్లో టిబెటన్లకే హక్కు ఉండే విధంగా రూపొందించిన ది టిబెటన్ పాలసీ, సపోర్ట్ యాక్ట్ 2020కి వారం క్రితం అమెరికా కాంగ్రెస్ ఆమోదించింది. అయితే, చైనా అభ్యంతరాలు చెబుతున్నా.. ఆ బిల్లుపై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. దీంతో టిబెట్లోని లాసాలో అమెరికా రాయబార కార్యాలయం ఏర్పటు చేయనున్నారు.
అయితే, ఇందుకు చైనా అడ్డుతగిలే ఆస్కారం ఉంది. ఈ క్రమంలో అమెరికా చైనాపై పలు ఆంక్షలు విధించింది. టిబెట్లోని లాసాలో అమెరికా దౌత్య కార్యాలయం ఏర్పాటయ్యే వరకు కూడా.. అమెరికాలో కొత్త చైనా కాన్సులేట్ ఏర్పాటు చేసేందుకు వీల్లేకుండా చూసే అధికారాన్ని ఈ చట్టం అమెరికా అధికారులకు కల్పించడం గమనార్హం.
అంతేగాక, కేవలం టిబెట్లోని బౌద్ధులు మాత్రమే కొత్త దలైలామాను ఎంపిక చేయాలని కొత్త చట్టం స్పష్టం చేస్తోంది. ఇందులో చైనా జోక్యం చేసుకోకుండా ఈ చట్టం అడ్డుకుంటుంది. ఒకవేళ చైనా జోక్యం చేసుకుంటే ఆర్థిక, వీసా సంబంధ ఆంక్షలు విధించాలని అమెరికా ప్రభుత్వానికి స్పష్టం చేసింది. కాగా, ఈ చట్టం ద్వారా టిబెట్ వాసులకు అమెరికా స్వచ్ఛంద సంస్థలు ఆర్థిక సాయం చేసే అవకాశం ఏర్పడింది.
కాగా, నిజమైన స్వయంప్రతిపత్తిని కోరుకునే టిబెట్లోని ఆరు మిలియన్ల మంది, ముఖ్యంగా 14వ దలైలామా దీనిని సమర్థిస్తున్నారని కొత్త చట్టం వెల్లడించింది. అమెరికా చర్యలపై చైనా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అయినా, అమెరికా చైనాను పట్టించుకోకుండా ముందుకెళుతోంది.
టిబెట్ను చైనా దురాక్రమణ చేసిన నేపథ్యంలో 1959లో దలైలామా ఇండియాకు వచ్చి ఇక్కడే ఉండిపోయారు. ఆయనతోపాటు వేలాది మంది టిబెటన్లు మనదేశంలోని ధర్మశాలలో ఉంటున్నారు. సుమారు లక్ష మంది వరకు టిబెటన్ బౌద్ధులు మనదేశంలోనే ఉంటున్నారు. ఇక అమెరికా, ఐరోపాల్లో సుమారు లక్షా 50వేల మంది టిబెటన్లు ఆశ్రయం పొందుతున్నారు.