డ్రీమర్లకు ట్రంప్ షాక్: 8 లక్షలమంది ఇంటికే, టెక్ దిగ్గజాల నిరసన
వాషింగ్టన్: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలసదారులు, శరణార్ధులపై కఠినంగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకొన్నారు. సుమారు 8 లక్షల మంది డ్రీమర్స్ వర్క్ పర్మిట్లను రద్దు చేశారు. ఈ నిర్ణయంతో ఏడువేల మంది భారతీయ అమెరికన్ యువకులపై ప్రభావం చూపనుంది.
చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులతో పాటు అమెరికా వచ్చి అక్కడే ఉద్యోగాలు చేస్తున్న యువత డ్రీమర్స్ను అక్రమ వలసదారులుగా గుర్తించారు. ఒబామా అధికారంలో ఉన్న సమయంలో ఈ నిర్ణయాన్ని వాయిదా వేశారు. కానీ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హమీ మేరకు ట్రంప్ డ్రీమర్స్ వర్క్ పర్మిట్లను రద్దు చేస్తూ మంగళవారం నాడు నిర్ణయం తీసుకొన్నారు.
అమెరికాలో నివసించేందుకు, పనిచేసేందుకు వీరికి అధికారికంగా ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేవు. ఈ డ్రీమర్ల వర్క్ పర్మిట్లను రద్దు చేయడాన్ని అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా తీవ్రంగా ఖండించారు.
ట్రంప్ తీసుకొన్న నిర్ణయాన్ని ఒబామా క్రూరమైన నిర్ణయంగా ప్రకటించారు. ఎన్నికల్లో సమయంలో ఇచ్చిన హమీ మేరకు ట్రంప్కు ఈ నిర్ణయం తీసుకోవడం అనివార్యంగా మారింది.
ఒబామా ప్రభుత్వం వాయిదా
అమెరికాకు బాల్యంలో వచ్చినవారిపై చర్యలు వాయిదా (డిఫర్ట్ యాక్షన్ ఫర్ ఛైల్డ్హుడ్ అరైవల్స్-డీఏసీఏ) సహయ కార్యక్రమాన్ని 2012 జూన్ 15న ఒబామా ప్రకటించారు. అమెరికా ఫెడరల్ సర్కార్ నిధులతో అమలయ్యే కార్యక్రమంలో 8 లక్షల మంది పెట్టుకొన్న ధరఖాస్తుల్ని ఆమోదించారు. ప్రతి రెండేళ్ళకు తమ వర్క్ పర్మిట్లను పొడిగించుకొనే వెసులుబాటును కల్పించారు. ఆ వర్క్ పర్మిట్లను ట్రంప్ రద్దు చేశారు.
హమీని నిలుపుకొన్న ట్రంప్
ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగానే అధికారంలోకి రాగానే డిఏసీఏను రద్దుచేస్తామని ట్రంప్ హమీ ఇచ్చారు. వర్క్ పర్మిట్ల పునరుద్దరణను రద్దుచేసి స్వదేశాలకు పంపాలని రెండేళ్ళ క్రితమే డిమాండ్ ప్రారంభమైంది. డ్రీమర్ల వల్ల అమెరికన్ల ఉపాధి దెబ్బతింటుందని ట్రంప్ మద్దతుదారుల ఆందోళన.దీంతో ఎన్నికల ప్రచారంలో డ్రీమర్ల వర్క్ పర్మిట్లను రద్దుచేస్తామని ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు మంగళవారం నాడు ట్రంప్ వర్క్ పర్మిట్లను రద్దుచేస్తూ సంతకం చేశారు.
అర్ధాంతరంగా పంపడంపై నిరసన
డ్రీమర్ల వర్క్పర్మిట్లను రద్దు చేస్తూ వారిని తిరిగి వారి స్వదేశాలకు పంపడాన్ని పలు రాజకీయపార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మెక్సికో, దక్షిణ అమెరికా దేశాల నుండి అమెరికా నుండి ఎక్కువగా ఉన్నారు. భారత్, వియత్నాం వంటి ఆసియాదేశాలకు చెందిన యువత తొమ్మిది శాతం మాత్రమే. వీరందరిని అర్ధాంతరంగా పంపడంపై పలు రాజకీయపార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
టెక్కీ దిగ్గజాల నిరసన
డిఏసీఏ రద్దును ఫేస్బుక్ సీఈఓ జుకర్బర్గ్, యాపిల్ సిఈఓ టీమ్కుక్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ళ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ , అమెజాన్ సిఈఓలు తీవ్రంగా వ్యతిరేకించారు. వలసదారులకు చట్టపరంగా రక్షణ కొనసాగించాలని డీఏసీఏను రద్దు చేస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థకు ప్రమాదకరమంటూ 300 మంది టెక్, బిజినెస్ దిగ్గజాలు ట్రంప్కు లేఖ రాశారు.
ట్రంప్ నిర్ణయంపై రిపబ్లికన్ పార్టీ నిరసన
రిపబ్లికన్ పార్టీకి చెందిన సెనెటర్లు, ప్రతినిధుల సభ సభ్యులు , స్సీకర్ కూడ డ్రీమర్ల వర్క్ పర్మిట్ను రద్దు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కానీ, రిపబ్లికన్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు మాత్రం వర్క్ పర్మిట్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.