ప్రపంచంలో శక్తిమంతమైన మహిళ: సీఈవోలకు విందులో ఇంద్రానూయికి ట్రంప్ ప్రశంస
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ప్రముఖ కార్పోరేట్ కంపెనీల సీఈవోలకు, ప్రముఖులకు విందు ఇచ్చారు. న్యూజెర్సీలోని తన వ్యక్తిగత గోల్ఫ్ కోర్సులో ఏఱ్పాటు చేసిన విందుకు పెప్సికో నుంచి తప్పుకోనున్న సీఈవో ఇంద్రానూయి, మాస్కర్ కార్డ్స్ సీఈవో అజయ్ బంగా తదితరులు పాల్గొన్నారు.
అమెరికా ఆర్థిక వ్యవస్థపై దేశంలోని పలువురు కార్పోరేట్ ప్రముఖుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఆయన విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఇంద్రానూయిని ట్రంప్ ప్రశంసించారు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన మహిళ అని ట్రంప్ కొనియాడినట్లు వైట్ హౌస్ పేర్కొంది.
ఈ సంవత్సరం ఆర్థిక వ్యవహారాల విషయంలో ముందుకు వెళ్లేందుకు పలువురు సీఈవోల అభిప్రాయాలను, వారి దృష్టికోణం, వారి ప్రాధాన్యతలు, ఆలోచనలు తెలుసుకునేందుకు ట్రంప్ ఈ విందు ఏర్పాటు చేశారని వైట్ హౌస్ తెలిపింది. ఈ విందుకు ఇంద్రానూయి తన భర్త రాజ్ నూయితో కలిసి హాజరైంది. అజయ్ బంగా తన సతీమణి రీతూ బంగాతో విందుకు వచ్చారు. పదిహేను మంది ప్రముఖ సీఈవోలు హాజరయ్యారని తెలుస్తోంది.