టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ రేసులో ఐసిస్ నేత బాగ్దాదీ!
న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలకు వణికిస్తోన్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) చీఫ్ అబూ బకర్ ఆల్ బగ్దాదీ అరుదైన రికార్డును సొంతం చేసుకునేందుకు కూత వేటు దూరంలో ఉన్నాడు. ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ప్రతి ఏడాది ప్రకటించే 'పర్సన్ ఆఫ్ ది ఇయర్' టైటిల్కు 2015 సంవత్సరానికి గాను తయారు చేసిన తుది జాబితాలో ఐఎస్ఐఎస్ చీఫ్ అబూ బకర్ ఆల్ బగ్దాదీ, రిపబ్లికన్ పార్టీ నాయకుడు డొనాల్డ్ ట్రంఫ్లు ఉన్నారు.
ఆన్లైన్లో పాఠకులు ఎన్నుకున్న వ్యక్తుల నుంచి 'టైమ్' మ్యాగజైన్ సంపాదకులు సోమవారం 8 మందితో కూడిన తుది జాబితాను రూపొందంచింది. ఈ సందర్భంగా ‘టైమ్స్ మ్యాగజైన్' అబూబకర్ ఆల్ బాగ్దాదీని ప్రశంసలతో ముంచెత్తింది. అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్న డోనాల్డ్ ట్రంప్ తో సరిసమానంగా అతడు సత్తా చాటుతున్నాడని స్వయానా ఆ మేగజీన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
'ఐసీస్ నాయకుడిగా ఆయన తనంతట తానుగా ప్రకటించుకుని ఇరాక్, సిరియాల్లో తాను అనుకున్న సొంత రాజ్యాన్ని నిర్మించడంలో బాగ్దాదీ తనదైన శైలిలో తన అనుచరులను ఉత్తేజపరుస్తున్నాడు. అంతేకాక ట్యునీషియా, ఫ్రాన్స్ లాంటి దేశాల్లో భీకర దాడులకు వారిని సర్వసన్నద్ధం చేస్తున్నాడు'' అంటూ టైమ్ పేర్కొంది.
ప్రస్తుతం 8 మందితో కూడిన తుది జాబితాలో బాగ్దాదీ, ట్రంప్ ల మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ప్రపంచ వ్యాప్తంగా తొలి జాబితాలో భారత ప్రధాని నరేంద్రమోడీ, రిలయన్స్ దిగ్గజం ముఖేష్ అంబానీ, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్లతో సహా 58 మంది ప్రముఖులతో జాబితాను రూపొందించారు. అయితే, భారత్కు చెందిన ఈ ముగ్గురు ప్రముఖులు తుది జాబితాలో చోటు దక్కించుకోలేక పోయారు.