ఉత్తరకొరియా: అసలే పిచ్చోడి చేతిలో రాయి, మరింత ఆజ్యం పోసిన డొనాల్డ్ ట్రంప్!
ఉత్తరకొరియా దూకుడు తగ్గకపోవడంతో కిమ్ ను ఎలా అడ్డుకోవాలో తెలియక అమెరికా అధ్యక్షుడు సతమతం అవుతున్నారు. తీవ్ర అసహనంతో తన నోటిదురుసుతనం బయటపెట్టుకుంటూ ఉత్తరకొరియా అధినేతకు మరింత మండేలా చేస్తున్నారు.
వాషింగ్టన్: అటు చూస్తే.. ఉత్తరకొరియా వ్యవహారం 'పిచ్చోడి చేతిలో రాయి'లా మారింది. వరుస క్షిపణి పరీక్షలతో ఇక తనకు ఎదురే లేదనే భ్రమలో నిండా మునిగి ఉన్న ఆ దేశ నియంత కిమ్ జాంగ్ ఉన్ అగ్రరాజ్యం అమెరికాను సైతం తాను క్షణాల్లో భస్మీపటలం చేయగలననే ధీమా లో ఉన్నారు.
అమెరికావి ప్రగల్భాలేనా? ఉత్తరకొరియాను ట్రంప్ ఏం చేయలేరా?.. అదేనా కిమ్ ధైర్యం, ఎందుకిలా?
ఇటు చూస్తేనేమో... అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన నోటిదురుసుతనం ప్రదర్శిస్తూ ఉత్తర కొరియాకు హెచ్చరికల మీద హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు కిమ్ జాంగ్ ఉన్ ను మరింత టైట్ చేసేందుకు క్షిపణి పరీక్ష జరిపినప్పుడల్లా.. గగ్గోలు పెట్టేసి.. ఉత్తరకొరియాపై కఠిన ఆంక్షలు విధించేలా ఐక్యరాజ్య సమితి మీద ఒత్తడి తీసుకొస్తున్నారు.
అమెరికా.. ఇదీ మా సత్తా! తాజా క్షిపణి ప్రయోగంతో స్పష్టమైన సంకేతం, ఇక టార్గెట్ అదే!
అగ్నిలో ఆజ్యం పోసిన చందంగా...
ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ క్షిపణి పరీక్షలకు ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణం. అయినా సరే.. నేను ఆగను గాక ఆగను అంటూ కిమ్ వరుసబెట్టి అణ్వస్త్ర పరీక్షలు జరుపుతూనే ఉన్నారు. కఠిన ఆంక్షల నేపథ్యంలోనూ ఉత్తరకొరియా దూకుడు తగ్గకపోవడంతో కిమ్ ను ఎలా అడ్డుకోవాలో తెలియక అమెరికా అధ్యక్షుడు సతమతం అవుతున్నారు. తీవ్ర అసహనంతో తన నోటిదురుసుతనం బయటపెట్టుకుంటూ ఉత్తరకొరియా అధినేతకు మరింత మండేలా చేస్తున్నారు. తాజాగా తన వ్యాఖ్యలతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కిమ్ జాంగ్ ఉన్ ను రెచ్చగొట్టారు.
Recommended Video
మరింత రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు...
ఇటీవల ట్రంప్ దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్తో ఫోన్లో మాట్లాడారు. అనంతరం ఇదే విషయాన్ని ఆయన చెబుతూ..‘నేను దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్తో గత రాత్రి మాట్లాడాను. ఈ సందర్భంగా ‘ రాకెట్ మెన్ ఏం చేస్తున్నాడు? సుదూరాల నుంచి గ్యాస్ పైపు లైన్ నిర్మిస్తున్నాడా..? అతడి చర్యలు ఏం బాగోలేవు..! అని వ్యాఖ్యానించాను..'' అని చెప్పారు.
ఉత్తరకొరియా ఖండాంతర క్షిపణిని ప్రయోగించిన కొన్ని రోజులకే అమెరికా వైపు నుంచి ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు వెలువడ్డాయి. ఇదే సమయంలో ట్రంప్ సలహాదారులు కూడా ఉత్తరకొరియా తన తీరు మార్చుకోవాలంటూ హెచ్చరికలు జారీ చేయడం ఉత్తరకొరియా అధినేతకు రుచించలేదు.
ఉత్తరకొరియా ధ్వంసమైపోవచ్చు...
మరోవైపు ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో అమెరికా ప్రతినిధి నిక్కీ హేలీ మాట్లాడుతూ ‘ ఉత్తరకొరియాకు ఆంక్షల తీవ్రత ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. ఇటీవలి ఆంక్షల దెబ్బకు ఆ దేశానికి ప్రపంచంతో సంబంధాలు దాదాపు తెగిపోయాయి. దౌత్య, సైనికేతర పరిష్కాలకు మార్గాలు దూరమైపోతున్నాయి. ఉత్తరకొరియా వైఖరిని ఇలాగే కొనసాగితే.. అమెరికా ఏం చేయాలో అదే చేస్తుంది. అమెరికాకు తనను తాను రక్షించుకోవడమే కాదు, తన మిత్రదేశాలను ఎలా రక్షించుకోవాలో కూడా తెలుసు. ఈ క్రమంలో ఉత్తరకొరియా ధ్వంసమైపోవచ్చు. మాకు అన్ని మార్గాలు తెలుసు.. కానీ మాలో ఎవరూ యుద్ధం కోరుకోవడం లేదు. కానీ యుద్ధం చేయాల్సి వచ్చేలాగే ఉంది..' అంటూ ఉత్తరకొరియాను తీవ్రంగా హెచ్చరించారు.
మిత్రదేశమే అయినా.. చైనాకీ భయమే...
ఉత్తరకొరియా విషయంలో చైనా కూడా భయడుతోంది. మిత్రదేశమే అయినప్పటికీ ఎంత వారించినా ఆ దేశాధినేత కిమ్ మాట వినకపోవడంతో చైనా కూడా సందిగ్ధావస్థలో పడిపోయింది. అంతేకాదు, ప్రపంచదేశాలన్నీ విమర్శలు గుప్పిస్తున్నా, అమెరికా, ఐక్యరాజ్య సమితి తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నా కిమ్ జాంగ్ ఉన్ తన క్షిపణి పరీక్షలు కొనసాగిస్తూనే ఉండడం చైనాకు కూడా రుచించలేదు. ఇదిలాగే కొసాగితే.. ఏదో ఒక రోజు పక్కనే ఉన్న తమపై కూడా క్షిపణిని గురిపెడతాడేమో అనేది చైనా భయం. ఇందుకు తగ్గట్లుగానే తాజాగా ఉత్తరకొరియా ప్రయోగించిన బాలిస్టిక్ మిస్సైల్ ఉత్తర చైనా సరిహద్దుల గుండా ప్రయాణించిందట. ఈ విషయాన్ని గమనించిన చైనా మిలిటరీ అధికారులు ప్రస్తుతం.. ఉత్తరకొరియా పేరు చెబితేనే ఉలిక్కిపడుతున్నారు.
చైనా ‘కటిఫ్' చెప్పేస్తుందా?
మరోవైపు బీజింగ్ కేంద్రంగా ఉత్తరకొరియా ద్వైపాక్షిక సంబంధాలు పూర్తిగా దెబ్బతినే అవకాశం కనిపిస్తోంది. గత శుక్రవారం ఉత్తరకొరియా చేపట్టిన క్షిపణి ప్రయోగంపై బీజింగ్ లో ఉన్న కార్నెగీ-టీషింగువా కేంద్రంలోని చైనా-ఉత్తరకొరియా వ్యవహారాల నిపుణుడు తాంగ్ జావో మాట్లాడుతూ ‘‘ఉత్తరకొరియా మాకు మంచి మిత్రదేశమే.. కానీ దాని న్యూక్లియర్ మిస్సైల్ ప్రయోగాలు మమ్మల్ని కూడా కలవర పెడుతున్నాయి.. కత్తి పట్టుకున్న ఉన్మాది పొరుగు వారికి గాయం చేయకుండా ఊరుకోడు.. ప్రస్తుతం ఉత్తరకొరియా కూడా అదే ఉన్మాదంలో ఉంది.. ఈ ఉన్మాదం మరింత పెరిగితే ఎవరు శత్రువో, ఎవరు మిత్రుడో కూడా అది మరిచిపోవచ్చు... అది చైనాకు కూడా పెద్ద ప్రమాదమే..'' అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండానే ఉత్తరకొరియా మిస్సైల్ ప్రయోగించడం చూస్తుంటే... ఏదో ఒకరోజు తమ దేశానికి కూడా గురిపెడుతుందేమో అనే భయం కలుగుతోందంటూ తాంగ్ జావో వ్యాఖ్యానించడం గమనార్హం. అయితే చైనా భయాన్ని అమెరికా మీడియా మాత్రం కొట్టిపారేసింది. అదంతా చైనా, ఉత్తరకొరియాల కపట నాటకమని, ఆ రెండు దేశాలను ఎవరూ నమ్మే స్థితిలో లేరంటూ కథనాలు ప్రచురించింది.