ఐసిస్ తల నరికేస్తా: డొనాల్ట్ ట్రంప్ సంచలనం
న్యూఢిల్లీ: రిపబ్లికన్ పార్టీ తరుపున అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ 'నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఎస్ఐఎస్ తల నరికేస్తాను. వారి చమురును మన అధీనంలోకి తీసుకుంటాను' అంటూ మొదటి టీవీ ప్రకటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమెరికాలోకి ముస్లింలు రాకుండా తాత్కాలిక నిషేధం విధించాలని, దేశంలో ఏం జరుగుతున్నదో స్పష్టంగా తెలుసుకొనే వరకు ఇది కొనసాగాలని ఈ ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, హిల్లరీ క్లింటన్ ఫొటోలతో ఈ టీవీ ప్రకటన మొదలైంది.
యుద్ధరంగంలో అమెరికా క్రూయిజ్ క్షిపణిని పేల్చడం, కాలిఫోర్నియాలో ఉగ్రవాద దాడికి పాల్పడిన నిందితుల ఫొటోలు, అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో వలస దృశ్యాలు, ఇస్లామిక్ స్టేట్ దృశ్యాలు ఈ ప్రకటనలో కనిపిస్తాయి. వీడియో వెనుక గంభీరమైన గొంతుతో ఈ దృశ్యాలకు అనుగుణంగా మాట్లాడారు.
దేశంలో ఏం జరుగుతున్నదో తెలుసుకునేవరకు అమెరికాలో ముస్లింలు ప్రవేశించకుండా తాత్కాలిక నిషేధం విధించాలని ఆయన కోరుతున్నారు. అంతేకాదు అమెరాకను మరోసారి అత్యున్నతంగా తీర్దిదిద్దుతా అన్నారు. ఉగ్రవాదం పట్ల అమెరికా మూర్ఖత్వాన్ని చూసి ప్రపంచం నవ్వుతోందన్నారు.
దీనిని మనం అరికట్టాలి. అమెరికన్లు అత్యంత చురుగ్గా వ్యవహరించాల్సిన సమయం వచ్చిందన్నారు. లేకపోతే మనకు దేశమే మిగలకపోవచ్చు. అధ్యక్ష ఎన్నికల్లో ప్రచారం కోసం నేను 35 మిలియన్ల నుంచి 40 మిలియన్ల డాలర్లు ఖర్చుపెట్టేలా బడ్జెట్ను నిర్దేశించుకున్నానని తెలిపారు.
మెక్సికోలోని దక్షిణ సరిహద్దుల్లో గోడ నిర్మించడం ద్వారా ఆయన అక్రమ వలసను అడ్డుకుంటానన్నారు. నాకు ఎలాంటి ప్రకటనలూ అవసరం లేదన్నారు. ఎందుకంటే భారీస్థాయిలో ప్రజామద్దతు ఉందన్నారు. నిజాయితీగా చెబుతున్నా, ఎన్నికల్లో డబ్బు ఖర్చు చేయడాన్ని నేను నేరంగా భావిస్తానన్నారు.