కంప్యూటర్లను హ్యాక్ చేశారహో: ట్రంప్ సంచలనం: వైట్హౌస్ వీడటంపై ట్రంప్ మంకుపట్టు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తన ఓటమిని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఎన్నికల ఫలితాలను అంగీకరించలేకపోతున్నారు. అధ్యక్ష ఎన్నికల కౌంటింగ్లో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయంటూ న్యాయపరమైన పోరాటం చేస్తోన్న ఆయన అధికారిక నివాసం వైట్హౌస్ను వీడటంపై మంకుపట్టు ప్రదర్శిస్తున్నారు. మొదట్లో బ్యాలెట్ పేపర్ల లెక్కింపులో అక్రమాలకు పాల్పడ్డారంటూ వాదిస్తూ వచ్చిన ట్రంప్..ఈ సారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈవీఎంలను హ్యాక్ చేశారని ఆరోపిస్తున్నారు.
ఎలక్టోరల్ కాలేజీ ప్రకటిస్తేనే..
వైట్హౌస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడిగా జో బిడెన్ ఎన్నికైనట్లు ఎలక్టోరల్ కాలేజీ, ఎన్నికల అథారిటీ అధికారికంగా ప్రకటించిన తరువాతే వైట్హౌస్ను వదిలి వెళ్తానని డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు. అమెరికా అధ్యక్ష పదవి కోసం ఎన్నికల్లో రిగ్గింగ్కు పాల్పడిన జో బిడెన్.. విజయం సాధించినట్లు ఎన్నికల అథారిటీ ఎప్పటికీ ప్రకటించబోదని తాను విశ్వసిస్తున్నట్లు చెప్పారు. ఎలక్టోరల్ కాలేజీ అలాంటి ప్రకటన చేస్తే.. అది అతి పెద్ద తప్పిదమౌతుందని వ్యాఖ్యానించారు.
ఈవీఎంలను హ్యాక్ చేశారంటూ..
అధ్యక్ష ఎన్నికల్లో కంప్యూటర్ డివైస్లను వినియోగించారని, వాటిని సులువుగా హ్యాక్ చేయడానికి అవకాశం ఉందని ట్రంప్ చెప్పారు. రిపబ్లికన్లు బలంగా ఉన్న చోట్ల హ్యాక్ చేయడానికి అవకాశం ఉన్న డివైస్లను పోలింగ్ కోసం వినియోగించారని విమర్శించారు. ఈ ఏడాది జనవరిలో అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచీ ఓట్ల లెక్కింపు వరకూ పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. కొత్త అధ్యక్షుడిగా జో బిడెన్ ఎన్నికైనట్లు ఎలక్టోరల్ కాలేజ్ సర్టిఫై చేసిన తరువాతే వైట్హౌస్ వీడతానని మెలిక పెట్టారు.
అత్యున్నత స్థాయి వరకూ అక్రమాలు..
అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో కింది స్థాయి నుంచి అత్యున్నత స్థాయి వరకూ అక్రమాలు చోటు చేసుకున్నాయని ట్రంప్ ఆరోపించారు. వాటిని రిగ్గింగ్ ఎన్నికలుగా అభివర్ణించారు. వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన జో బిడెన్ నిర్వహించ తలపెట్టిన వైట్హౌస్ కార్యాలయం ప్రారంభోత్సవానికి తాను హాజరవుతానా? లేదా? అనేది ఇప్పుడే చెప్పబోనని అన్నారు. ఆ ప్రశ్నకు తన వద్ద సమాధానం ఉందని, దాన్ని ఇప్పుడే బయటపెట్టలేనని ట్రంప్ సమాధానం ఇచ్చారు.
మీడియా, టెక్ కంపెనీల కుట్ర..
అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకోవడానికి మీడియా కూడా ఓ కారణమైందని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. కొన్ని మీడియా హౌస్లు తనకు వ్యతిరేకంగా పని చేశాయని విమర్శించారు. కొన్ని బడా టెక్ కంపెనీలు కూడా అన్ ఫెయిర్గా వ్యవహరించాయని పేర్కొన్నారు. ఏ ఎన్నికల్లోనైనా తాను భారీ మెజారిటీతో గెలవగలనని, అధ్యక్ష ఎన్నికల్లోనూ అదే చోటు చేసుకుందని వ్యాఖ్యానించారు. మీడియా గానీ, కొన్ని బిగ్ టెక్ కంపెనీలు గానీ.. నిజాన్ని దాచి ఉంచినప్పటికీ..వాస్తవ పరిస్థితులేమిటనేది అమెరికన్లకు బాగా తెలుసునని చెప్పారు. పెన్సిల్వేనియా వంటి కొన్ని రాష్ట్రాల్లో తాము ఆధిక్యతలో ఉన్నప్పటికీ.. ఓట్ల లెక్కింపులో చోటు చేసుకున్న అక్రమాల వల్ల డెమొక్రాట్ల ముందంజలోకి వచ్చారని విమర్శించారు.