వణికిస్తోన్న జాత్యహంకారం: ఆజ్యం పోసేలా ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
ఇంత జరుగుతున్నా అధ్యక్షుడు ట్రంప్ తీరులో మాత్రం మార్పు లేదు. జాత్యహంకార దాడులు వరుసగా జరుగుతున్నా.. ఘటనల పట్ల ఆయన ఏమాత్రం స్పందించకపోగా.. అమెరికన్ల కోసమే తాను పనిచేస్తానన్న సంకేతాలు పంపిస్తున్నారు.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి లోకల్ మంత్రాను జపిస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. స్థానికులకే పెద్ద పీట వేస్తూ విదేశీయుల పట్ల ఆయన నిర్లక్ష్యపూరిత ధోరణిని అవలంభిస్తున్నారు.
ట్రావెల్ బ్యాన్, వీసా రూల్స్, జాబ్ రూల్స్.. ఇలా ఆయన తీసుకున్న ప్రతీ నిర్ణయం విదేశీ వలసలను అరికట్టే విధంగానే ఉంది. అయితే ట్రంప్ కొనసాగిస్తున్న ఈ ధోరణి అక్కడి అమెరికన్లలో విదేశీయుల పట్ల కక్షపూరిత వాతావారణాన్ని సృష్టిస్తోంది. విదేశీయులు తమ ఉద్యోగాలను తన్నుకుపోతున్నారన్న భావన వారిలో పెరిగిపోతోంది.
ఇదే క్రమంలో కన్సాస్ రాష్ట్రంలోని ఒలాతేలో జరిగిన కాల్పుల వెనుక మర్మం కూడా ఇదే. ఈ ఘటనలో తెలుగు యువకుడు కూచిబొట్ల శ్రీనివాస్ మరణించగా.. వారిని ఉగ్రవాదులుగా సంబోధిస్తూ యూఎస్ మాజీ నేవి ఉద్యోగి ఆడమ్ ఈ కాల్పులకు తెగబడ్డాడు.
ఇంత జరుగుతున్నా అధ్యక్షుడు ట్రంప్ తీరులో మాత్రం మార్పు లేదు. జాత్యహంకార దాడులు వరుసగా జరుగుతున్నా.. ఘటనల పట్ల ఆయన ఏమాత్రం స్పందించకపోగా.. అమెరికన్ల కోసమే తాను పనిచేస్తానన్న సంకేతాలు పంపిస్తున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
ప్రపంచానికి తాను ప్రతినిధిని కాదని, కేవలం అమెరికాకు మాత్రమే తాను అధ్యక్షుడినని కన్సర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్(సీపీఏసీ)లో ట్రంప్ పేర్కొన్నారు. గన్ ఓనర్ షిప్ రైట్స్ పై చర్యలు తీసుకుంటామని అన్నారు. అమెరికన్లకే ఉద్యోగాలు దక్కేలా చేస్తానని ట్రంప్ మరోసారి పునరుద్ఘాటించారు.
'ప్రపంచమంతా ఒకే గీతం ఉందా?.. ఒకే కరెన్సీ, ఒకే జెండా ఉన్నాయా?.' అని ట్రంప్ వ్యంగ్యంగా స్పందించారు. చికాగోలోని పలు ప్రాంతాల్లో చోటు చేసుకున్న తుపాకీ కాల్పులపై ట్రంప్ ఆందోళన వ్యక్తం చేశారు. తుపాకీ కాల్పుల్లో ఏడుగురు మృతిచెందడంపై పట్ల ఆయన స్పందిస్తూ.. 'అసలు చికాగోలో ఏం జరుగుతోంది? చికాగోకు ఇప్పుడు సహాయం అవసరం' అని ట్రంప్ చెప్పుకొచ్చారు.
మొత్తం మీద ట్రంప్ తీరుతో రానున్నరోజుల్లో విదేశీయులకు, ముఖ్యంగా భారతీయులకు అమెరికాలో గడ్డు పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.