చైనా విమానాల నిలిపివేతకు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం: డ్రాగన్ తీరు మారకుంటే అంతే
వాషింగ్టన్: అమెరికా, చైనాల మధ్య కరోనా మహమ్మారి విషయంలో నెలకొన్న వివాదం మరింత ముదురుతోంది. కరోనావైరస్ను చైనానే సృష్టించిందంటూ ఆరోపణలు చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. డ్రాగన్ దేశంపై పలు ఆంక్షలను కూడా విధిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమయ్యారు.
చైనాకు చెందిన నాలుగు విమానయాన సంస్థల రాకపోకలను నిలిపివేయనున్నట్లు అమెరికా ప్రకటించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జూన్ 16 నుంచి అమల్లోకి తీసుకువచ్చే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడి పరిపాలన విభాగం అధికారులు వెల్లడించారు.
కాగా, కరోనావైరస్ వ్యాప్తి కారణంగా ఈ ఏడాది మొదట్లో చైనాలోని వుహాన్ ప్రావిన్స్కు అమెరికా తమ దేశానికి చెందిన విమానాల రాకపోకలను నిలిపివేసింది. అయితే, జూన్ 1 నుంచి అమెరికా విమానయాన సంస్థలైన యునైటెడ్ ఎయిర్లైన్స్ , డెల్టా ఎయిర్లైన్స్ సేవలు తిరిగి ప్రారంభించేందుకు సిద్దమయ్యాయి. అయితే, వీటికి అనుమతులు మంజూరు చేయలేదు చైనా. ఈ క్రమంలోనే అమెరికా తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇరు దేశాల మధ్య విమానాల రాకపోకలపై జరిగిన ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించిందని అమెరికా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆరోపిస్తోంది. అయితే, ఈ విషయంపై చైనాతో సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపింది. ఈ సమయంలో చైనా ప్రభుత్వం ఎన్ని అమెరికా విమానాలను తమ దేశంలోకి అనుమతిస్తుందో అదే స్థాయిలో చైనా విమానాలను అమెరికాలోకి అనుమతిస్తామని అమెరికా రవాణా శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఇక అమెరికా తీసుకునే చర్యలు చైనా వ్యవహరించే తీరును బట్టి ఉంటుందని తెలుస్తోంది.