అభిశంసన తీర్మానంపై చర్చ వేళ... హింసకు పాల్పడవద్దని మద్దతుదారులకు ట్రంప్ విజ్ఞప్తి..
తనపై అభిశంసన తీర్మానానికి సంబంధించి అమెరికా ప్రతినిధుల సభలో చర్చ జరుగుతున్న వేళ ఎక్కడా ఎటువంటి హింసాత్మక ఘటనలకు పాల్పడవద్దని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన మద్దతుదారులకు విజ్ఞప్తి చేశారు. 'మరిన్ని నిరసన ప్రదర్శనలు జరగవచ్చునని కథనాలు వస్తున్న నేపథ్యంలో... ఎక్కడా ఎటువంటి హింసకు తావు ఇవ్వొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. చట్టాన్ని ఉల్లంఘించడం,విధ్వంసానికి పాల్పడటం చేయవద్దు. అలాంటి చర్యలకు నా మద్దతు ఉండదు... అమెరికా మద్దతు కూడా ఉండదు.' అని ట్రంప్ స్పష్టం చేశారు.
దేశంలో ఉద్రిక్తతలకు తెరదించి ప్రశాంతతను నెలకొల్పేందుకు అమెరికన్లంతా సహకరించాలని ట్రంప్ విజ్ఞప్తి చేశారు. ఈ నెల 6న కేపిటల్ భవనంలో అధ్యక్షుడి ఎన్నికను ధ్రువీకరించేందుకు కాంగ్రెస్ సభ్యులు సమావేశమైన సందర్భంగా ట్రంప్ మద్దతుదారులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. మొదట సేవ్ అమెరికా ర్యాలీ చేపట్టిన ట్రంప్ మద్దతుదారులు... ఆ తర్వాత కేపిటల్ భవనాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా చెలరేగిన హింసలో ఐదుగురు మృతి చెందారు. అమెరికా ప్రజాస్వామ్య చరిత్రలో ఇంతటి ఘోర పరిస్థితులు మునుపెన్నడూ చోటు చేసుకోలేదు.
అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్.. రెచ్చగొట్టే ప్రసంగాలు,సందేశాలతో తన మద్దతుదారులను కేపిటల్ భవనం పైకి ఉసిగొల్పాడు. ఐదుగురు అమాయకుల ప్రాణాలు పోవడానికి పరోక్షంగా కారణమయ్యాడు. ఇంత విధ్వంసం జరిగిన తర్వాత గానీ ట్రంప్ అధికార మార్పిడికి అంగీకరించలేదు. అయితే ట్రంప్ జనవరి 19 దాకా వైట్ హౌస్లోనే ఉంటే ఇంకెన్ని ఘోరాలు తలపెడుతాడోనన్న అనుమానాలు సర్వత్రా నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్ష పదవి గడువు ఇంకా పూర్తి కాకముందే ఆయన్ను వైట్ హౌస్ నుంచి సాగనంపాలని డెమోక్రాట్లతో పాటు రిపబ్లికన్లు కూడా భావిస్తున్నారు. ఇందుకోసం ట్రంప్పై డెమోక్రాట్లు ప్రతినిధుల సభలో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టారు.
రాజ్యాంగంలోని 25వ అధికరణకు సవరణ ద్వారా ట్రంప్ను గడువు కన్నా ముందే గద్దె దించేందుకు ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. ప్రస్తుతం దానిపై చర్చ జరుగుతోంది. అనంతరం హౌస్లో ఓటింగ్ నిర్వహిస్తారు. ఈ తీర్మానం మూడింట రెండొంతుల మెజారిటీతో ఇటు ప్రతినిధుల సభలో,అటు సెనేట్లో ఆమోదం పొందితే గడువు కన్నా ముందే ట్రంప్ గద్దె దిగడం ఖాయం.
తాజాగా అభిశంసన తీర్మానంపై చర్చ సందర్భంగా కేపిటల్ భవనం వద్ద భారీగా భద్రతా బలగాలను మోహరించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా సెక్యూరిటీ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.