1995 రసాయన దాడుల కేసులో మతగురువు షోకో అసహారాకు ఉరి
1995లో ప్రమాదకరమైన సరీమ్ వాయువును టోక్యో నగరంలోని సబ్వేలో విడుదల చేసి 13 మంది మృతికి కారణమైన ప్రముఖ మతగురువు షోకో అసహారను జపాన్ ప్రభుత్వం ఉరితీసింది. ప్రమాదకరమైన ఈ మతగురువుకు ఒకప్పుడు 10వేలకు పైగా భక్తులుండేవారు. 1995లో అంతర్జాతీయంగా ఈ ఘటనపై పెద్ద ఎత్తున దుమారం రేగింది.
1980లో ఆమ్ అనే సంస్థను స్థాపించి తన వాక్చాతుర్యం, ప్రసంగాలతో కొన్ని వేల మందిని అసహారా గురువు ఆకట్టుకున్నారు. ఇందులో ఎంతో మంది డాక్టర్లు ఇంజినీర్లు కూడా ఉన్నారు. తను చేసే నేరాల కోసం ఈ డాక్టర్లను ఇంజనీర్లను వినియోగించుకునేవాడు. అంతేకాదు బ్రెయిన్ వాష్ చేసి మనుషులను తనవైపునకు తిప్పుకోల సామర్థ్యం ఉన్నవాడు అసహారా. జపాన్లో ఒంటరిగా బతుకుతున్నవారే తను టార్గెట్ చేసి తన ఆమ్ సంస్థలో చేర్చుకునేవాడు. తన భక్తులకు భగవంతుడి శక్తి అందించడంలో తాను శిక్షణ ఇస్తానని నమ్మబలికేవాడు. కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తానని కోతలు కోసేవాడు.
ఇలా భక్తులను ఆకర్షించడం తన నేర సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం పరిపాటైంది. అంతేకాదు భక్తులు కూడా తమ గురువుకు ఎన్నో శక్తులున్నాయంటూ ప్రచారం చేసేవారు. అయితే ఈ బోగస్ గురువుకు కోపం వస్తే అసలు సహించేవాడు కాదట. కొంతో గొప్పో పేరుప్రఖ్యాతలు వచ్చాక 1990లో పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయారు. దీంతో కోపోద్రిక్తుడయ్యాడు. 1994లో అతని నిజస్వరూపం చూపించాడు. ఆమ్ సంస్థకు చెందిన ఆయన భక్తులు జపాన్లోని మాట్సుమోటో నగరంలో సరీన్ వాయువును వదిలి ఎనిమిది మందిని పొట్టనబెట్టుకున్నారు. అయితే ఇది అసహారే చేశాడని వెలుగులోకి రాలేదు. 1995 మార్చి 20న ఎప్పుడూ రద్దీగా ఉండే టోక్యో సబ్వేలో అక్కడక్కడ సరీన్ వాయువును విడుదల చేశాడు. దీంతో 13 మంది మృతి చెందగా వేలమంది అస్వస్థతకు గురయ్యారు.
అంతర్జాతీయంగా ఈ ఘటనపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో సీరియస్గా తీసుకున్న నాటి జపాన్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దీంతో కొందరి భక్తులను అరెస్టు చేసింది విచారణ సంస్థ. ఈ కేసులో 12 మందికి ఉరిశిక్ష కూడా వేసింది. ప్రస్తుతం ఆమ్ అనే ఈ సంస్థ ఆలెఫ్గా రూపాంతరం చెంది ఆసహారాను మతగురువుగా గుర్తింపు రద్దు చేసింది. అయితే ఇప్పటికీ కూడా తన ప్రసంగాలు పలువురి మనసుల్లో నిలిచిపోయాయని.. ఇప్పటికీ ఆయన ఫోటో ముందు పెట్టుకుని పూజలు చేస్తారని కొందరు చెబుతున్నారు.
అసహారాను ఉరి తీశారన్న వార్త తెలియడంతో ఆనాటి ఘటనలో మృతుల బంధువులు చాలా సంతోషపడ్డారు. అసహారాను ఎప్పుడో ఉరి తీసి ఉండాల్సిందని వారు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ దుర్మార్గుడిని అంతమొందించినందుకు సంబురాలు చేసుకుంటున్నామని మృతుల బంధువులు చెప్పారు.