గుహలో 9రోజుల క్రితం అదృశ్యమైన 12మంది బాలురు, కోచ్ క్షేమం: ఆనందం వెల్లివిరిసింది
Recommended Video
బ్యాంకాక్: ఉత్తర థాయిలాండ్లో తొమ్మిదిరోజుల క్రితం గుహల్లో చిక్కుకుపోయిన 12 మంది బాలురు, వారితోపాటు ఉన్న 25 ఏళ్ల పుట్బాల్ కోచ్ కథ సుఖాంతమైంది. వారంతా ప్రాణాలతోనే ఉన్నారని చియాంగ్ రాయ్ ప్రావిన్స్ గవర్నరు వెల్లడించారు. వారందర్నీ థాయిలాండ్ నావికాదళానికి చెందిన గజ ఈతగాళ్లు, సహాయక సిబ్బంది సోమవారం అర్ధరాత్రి క్షేమంగా తీసుకొస్తున్నారని తెలిపారు.
వారందరికీ ఆహారంతో పాటు ఈదడం వచ్చిన వైద్యుడ్ని పంపించామని వెల్లడించారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. 11 నుంచి 16 ఏళ్ల వయస్సుగల 12 మంది బాలురు, వారి కోచ్తో పాటు గుహలు చూడటానికి జూన్ 23న లోపలికి వెళ్లారు.
వరదలతో గుహలోనే చిక్కుకుపోయారు
కాగా, విపరీతంగా వర్షాలు కురవడంతో వరదనీటి ఉద్ధృతికి వీరంతా తామ్-లువాంగ్-నాంగ్నాన్ గుహలో చిక్కుకుపోయారు. వీరిని కాపాడేందుకు థాయ్ నావికాదళంతో పాటు అమెరికా సైన్యానికి చెందిన 30 మంది బృందం, ఆస్ట్రేలియా, బ్రిటీషు, చైనా నుంచి నిపుణులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు.
ఉపగ్రహ వ్యవస్థనూ వాడారు
13 మంది జాడ కనిపెట్టడానికి ఉపగ్రహ వ్యవస్థను సైతం ఉపయోగించారు. ఆదివారానికి థాయిలాండ్ నావికాదళం ఓ కీలకమైన, క్లిష్టమైన ప్రాంతానికి చేరుకుంది. అక్కడి నుంచి గుహ రెండుగా చీలిపోయింది.
ఆక్సిజన్ సిలిండర్లతో వెళ్లి చూడగా..
లోపలికి కిమీ దూరం ఉన్నట్లు గమనించిన సహాయక సిబ్బంది.. ఆక్సిజన్ సిలిండర్లు, తాళ్ల సాయంతో అందులోకి ప్రవేశించారు. వారు అనుకున్నట్లుగానే అక్కడే బాలురంతా ఉన్నారు. లోపల కొంతదూరం వెళ్లేసరికి గుహకు ఇసుక కప్పేసి ఉంది. చీకటిగా ఏమీ కనిపించలేదు. బురదనీరు అడ్డంకిగా మారడంతో దాన్ని దాటుకుని వెళ్లగా 13 మంది ప్రాణాలతో కనిపించారు.
ఆనందం వెల్లివిరిసింది
అక్కడ్నుంచి వారిని క్షేమంగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు సహాయక సిబ్బంది. పిల్లలంతా క్షేమంగా ఉన్నారని తెలియడంతో 9రోజులుగా తమ పిల్లల కోసం ఎదురుచూస్తున్న వారి కుటుంబసభ్యుల్లో ఆనందం వెల్లివిరిసింది. సహాయక సిబ్బందికి వారంతా కృతజ్ఞతలు తెలిపారు. అయితే, బాలురు, కోచ్ గుహలో చాలా లోపలికి వెళ్లడం, భారీ వర్షాల కారణంగా వరదలు రావడంతో వారిని ఇప్పుడే బయటికి తీసుకురావడం కష్టసాధ్యంగా మారింది. వారిని బయటికి తీసుకువచ్చేందుకు సుమారు 120రోజులు పట్టే అవకాశం ఉందని, అందుకే వారికి కావాల్సిన ఆహార పదార్థాలను అందించినట్లు సహాయక సిబ్బంది తెలిపారు. వారి ఆరోగ్య పరిస్తితిని ఇద్దరు వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.