నిర్లక్ష్యపు డ్రైవింగ్ ఫలితం: 17 కంగారూలు మృతి
బ్రిస్బేన్: రోడ్డుపైకి మేత కోసం వచ్చిన కంగారూలను వాహనంతో ఢీకొట్టి దారణంగా చంపేసిన ఘటన ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ శివారు ప్రాంతమైన వాకోల్లో ఆదివారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన 17 కంగారూలు అక్కడికక్కడే మృతి చెందాయి.
బ్రిస్బేన్ నుంచి గ్రిండల్కు వెళ్లే హైవే పక్కన ఆహారం కోసం సాయంత్రం పూట కంగారూలు రోడ్డుపైకి వస్తుంటాయని ఈ సమయంలోనే ఈ సంఘటన జరిగి ఉండొచ్చని రాయల్ సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్(ఆర్ఎస్పీసీఏ) అధికారులు చెబుతున్నారు.
వాహనం ఢీ కొట్టడంతో రోడ్డుపై సుమారు 100 మీటర్ల వరకు కంగారూల మృతేదహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. డ్రైవర్ కావాలనే కంగారూలను ఢీకొట్టి ఉంటాడనే కోణంలో పోలీసులు భావిస్తున్నారు.
ఆర్ఎస్పీసీఏ అధికార ప్రతినిధి మైఖెల్ బెట్టీ ఈ ఘటనపై స్పందిస్తూ కంగూరూలు అన్ని కూడా చాలా లేత వయసులో ఉన్నట్లు చెప్పారు. కంగారూలను ఢీకొట్టి వెళ్లిన అతని కోసం పోలీసులు గాలిస్తున్నామన్నారు. ఈ ప్రాంతంలో కంగారూలు గుంపులుగా రోడ్డుపైకి వస్తుంటాయన్నారు.
దీని కోసమే ఈ రోడ్డుపై ప్రయాణించే వాహనాలు నెమ్మదిగా వెళ్లాలనే సూచిక బోర్డులను కూడా పెట్టడం జరిగిందన్నారు. అయినా సరే ఇలాంటి సంఘటన జరగడం బాధాకరమన్నారు.