ఇంట్రెస్టింగ్: కరోనా బారిన పడ్డ పిల్లికి ఇచ్చే డ్రగ్ మనుషులకు కూడా పనిచేస్తుందట..!
టొరంటో: కరోనావైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ మహమ్మారి విరుగుడుకు ప్రపంచదేశాలు వ్యాక్సిన్ను కనుగొనే ప్రయత్నంలో ఉన్నాయి. ఈ క్రమంలోనే అనేక రకాల పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనల ద్వారా పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పిల్లులకు కరోనావైరస్ సోకితే వినియోగించే మెడిసిన్ కోవిడ్ వైరస్ సోకిన మనుషులకు కూడా పనిచేస్తుందని తాజా పరిశోధనల్లో తేలింది. ఇదే విషయాన్ని నేచర్ కమ్యూనికేషన్స్ జర్నల్లో ప్రచురించడం జరిగింది. అంతేకాదు ఈ మెడిసిన్తో హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ చేపట్టాలని పరిశోధకులు తెలిపారు.
పిల్లులకు వైరస్ సోకితే వినియోగించే డ్రగ్ మనుషులకు కూడా పనిచేస్తుందని కెనడాలోని యూనివర్శిటీ ఆఫ్ ఆల్బర్టా ప్రొఫెసర్ జోన్ లీమక్స్ చెప్పారు. ఈ డ్రగ్ తప్పకుండా మనుషుల్లో కూడా పని చేస్తుందనే కాన్ఫిడెన్స్ను ఆయన వ్యక్తం చేశారు. అయితే ముందుగా క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి సురక్షితంగా ఉండటంతో పాటు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవని నిర్థారించుకున్న తర్వాతే కోవిడ్-19 ట్రీట్మెంట్లో వినియోగించాలని సూచించారు.
పిల్లుల్లో GC376 అనే ప్రొటీస్ ఇన్హిబిటర్ను ప్రయోగించడం ద్వారా అది వైరస్ను అడ్డుకుంటుందని తద్వారా ఇన్ఫెక్షన్ తగ్గిపోతుందని పరిశోధకులు చెప్పారు. 2003లో తొలిసారిగా సార్స్ ప్రపంచాన్ని కుదిపేసినప్పుడు ఈ డ్రగ్కు సంబంధించి చర్చ జరిగింది. ఆ తర్వాత ఈ డ్రగ్ను వెటిరినరీ పరిశోధకులు డెవలప్ చేయడం జరిగింది. ప్రొఫెసర్ లీమక్స్ అతని బృందం కలిసి ముందుగా రెండు వేరియంట్లలో ఉండే ఈ డ్రగ్ను పరిశీలించింది. ముందుగా సార్స్ కోవిడ్-2 ప్రోటీన్ను, మానవుల్లో వచ్చే వైరస్లను టెస్ట్ ట్యూబ్లో తీసుకుని డ్రగ్తో పరీక్షలు నిర్వహించారు.ఈ పరీక్షలో పిల్లికి ఇచ్చే డ్రగ్ మనిషి వైరస్ను నియంత్రిస్తుందనే విషయాన్ని వారు గమనించారు.
ఈ పరీక్ష సక్సెస్ కావడంతో వైరస్ను ధీటుగా ఎదుర్కొనగలిగే మరిన్ని డ్రగ్స్ను తయారు చేస్తామని ప్రొఫెసర్ లీమక్స్ చెప్పారు. పిల్లికిచ్చిన డ్రగ్ వైరస్ను నియంత్రిస్తోందని మరో ప్రొఫెసర్ చెప్పారు. కరోనావైరస్కు అధికారికంగా ఒక మెడిసిన్ వచ్చేవరకు ఇలాంటి వాటితో మేనేజ్ చేయాలని వారు చెప్పారు.