ఫోన్లో గట్టిగా మాట్లాడినందుకు ఒకరిని హత్య చేసిన భారత సంతతి వ్యక్తి
ఫూట్గా తాగాడు...మత్తులో జోగుతున్నాడు. ఏమి చేస్తున్నాడో అతనికే తెలియదు.. సీన్ కట్ చేస్తే మద్యం మత్తు నుంచి తేరుకున్నాక ఓ వ్యక్తిని హత్య చేసిన విషయం తెలుసుకున్నాడు. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగిందో తెలుసా... దుబాయ్లో. ఇక వివరాల్లోకి వెళితే ... నిర్మాణం పనిపై దుబాయ్వెళ్లిన ఓ భారతీయుడు మరో వ్యక్తితో కలిసి గదిలో ఉంటున్నాడు. ఒక రోజు ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అప్పటికే వ్యక్తి ఫుల్గా తాగి ఉన్నాడు. ఇద్దరి మధ్య చిన్న గొడవ చోటు చేసుకుంది. వెంటనే కత్తి తీసుకుని మరో వ్యక్తిని పొడిచి హత్య చేశాడు భారత్కు చెందిన వ్యక్తి.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... ఒకే గదిలో ఉంటున్న ఇద్దరి మధ్య పెద్ద గొడవైందని చెప్పారు. అదే సమయంలో హత్యకు గురైన వ్యక్తి మరెవరికో ఫోన్ చేసి గట్టిగా మాట్లాడుతున్నాడు. ఇది భరించలేకపోయిన వ్యక్తి అక్కడే ఉన్న కత్తి తీసుకుని రెండు పోట్లు పొడిచాడు. దీంతో అక్కడే కుప్పకూలిపోయాడు మరో వ్యక్తి. గదిలో హత్య జరిగిన విషయం డ్రైవర్ తనకు ఫోన్ చేసి చెప్పినట్లు సూపర్ వైజర్ చెప్పాడు. గదికి వెళ్లి చూడగా ఆ వ్యక్తి రక్తపుమడుగులో పడి ఉన్నట్లు ఆయన వెల్లడించాడు.
అయితే ఇద్దరి మధ్య అంతకుముందే మాటల యుద్ధం జరిగినట్లు మిగతా కార్మికులు మాట్లాడుకున్నారని సూపర్ వైజర్ చెప్పారు. హత్య అనంతరం భారత్కు చెందిన వ్యక్తి చిన్నగా గదిలో నుంచి బయటకు రావడం గమనించినట్లు మరో కార్మికుడు చెప్పాడు. తన చేతి వేళ్ల మధ్య నుంచి రక్తం కారటం చూసినట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. ఆ దెబ్బ ఎలా తగిలింది అని తనను అడుగగా సమాధానం చెప్పకుండా మెల్లగా అక్కడి నుంచి జారుకున్నట్లు ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. ఇదిలా ఉంటే సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలించగా నేరస్తుడు కత్తిని తన బట్టల కింద దాస్తున్న దృశ్యాలు కెమెరా కంటికి చిక్కాయి. ఆ తర్వాత వాష్రూమ్లోకి వెళ్లి అక్కడి నుంచి చిన్నగా బయట పడ్డాడు. కేసును విచారణ చేసిన కోర్టు అక్టోబర్ 8కి వాయిదా వేసింది.