సహనాన్ని పరీక్షించొద్దు: సైనికుల దుందుడుకుపై అసహనం: చైనా ముఖం పగులగొట్టేలా భారత్
మాస్కో: లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద చైనా సైనిక బలగాల దుందుడుకు చర్యలపై భారత్ తీవ్ర అసంతృప్తిని, అసహనాన్ని వ్యక్తం చేసింది. సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడానికి కుదిరిన ఒప్పందాలకు తూట్లు పొడిచేలా వ్యవహరిస్తోందని కుండబద్దలు కొట్టింది. ఇలాంటి దుందుడుకు చర్యల వల్ల ఏ ఒక్కరికీ గానీ, ఎలాంటి ప్రయోజనం ఉండబోదని తెగేసి చెప్పింది. రెచ్చగొట్టే చర్యలను నిలిపివేయాలని స్పష్టం చేసింది. అదే ధోరణిని కొనసాగిస్తే అనంతరం చోటు చేసుకునే పరిణామాలకు పూర్తి బాధ్యతను చైనా వహించాల్సి ఉంటుందని హెచ్చరించింది.
చైనా విదేశాంగ శాఖతో ముఖాముఖి భేటీ..
రష్యా రాజధాని మాస్కో వేదికగా కొనసాగుతోన్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సు సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. భారత్కు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహణ్యం జైశంకర్.. చైనా వైఖరిపై తన నిరసన గళాన్ని వినిపించారు. తన చైనా కౌంటర్పార్ట్ వాంగ్ యీతో ముఖాముఖి భేటీ సందర్భంగా.. అసహనాన్ని, అసంతృప్తినీ వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో అనవసర వివాదాలకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు కారణమౌతున్నారని, ఉద్దేశపూరకంగా భారత భూమిపైకి చొచ్చుకుని రావడానికి ప్రయత్నిస్తున్నారని తేల్చిచెప్పారు.
సరిహద్దు ఉద్రిక్తతలపై
వాంగ్ యీతో ముఖాముఖి భేటీ సందర్బంగా జైశంకర్.. ఈ ప్రస్తావన తీసుకొచ్చారని అధికార వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్ నుంచి వాస్తవాధీన రేఖ వద్ద చోటు చేసుకుంటోన్న పరిణామాలను ఆయన ఏకరువు పెట్టారు. ప్రతి అంశంలోనూ భారత జవాన్లు సంయమనాన్ని పాటిస్తూ వచ్చారని స్పష్టం చేశారు. పీఎల్ఏ బలగాలు ఎంత రెచ్చగొట్టినప్పటికీ.. శాంతియుత వాతావరణాన్ని కొనసాగింపజేయడానికి, ఇదివరకు కుదిరిన ఒప్పందాలను భారత్ గౌరవించిందని పేర్కొన్నారు. చైనా తరఫున అలాంటి చర్యలేవీ లేకపోవడం పట్ల భారత ప్రభుత్వం అసహనానికి గురైందని ముఖం మీద చెప్పేశారు.
ప్రాణాంతక దాడుల పట్లా..
ప్రత్యేకించి- జూన్ 15, 16 తేదీల్లో గాల్వన్ వ్యాలీ వద్ద రెండు దేశాల సైనికుల మధ్య చోటు చేసుకున్న ప్రాణాంతక ఘర్షణలు, పరస్పర దాడి గురించీ జైశంకర్ ప్రస్తావించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ దాడిలో కల్నల్ సంతోష్బాబు సహా 20 మంది జవాన్లు వీరమరణాన్ని పొందిన విషయం తెలిసిందే. అలాంటి ఘటనలు పునరావృతం కావడానికి చైనా కారణమౌతోందని జైశంకర్ స్పష్టం చేశారు. తాజాగా కిందటి నెల 29, 30 తేదీల్లో పాంగ్యాంగ్ త్సొ సరస్సు దక్షిణ ప్రాంతంలోని షెన్పాయ్ పర్వతంపై చోటు చేసుకున్న వార్నింగ్ షాట్ ఫైరింగ్ ఉదంతాన్నీ ఆయన ప్రస్తావించారు.
ఒప్పందాలకు ఉల్లంఘనకు
చైనా తీసుకునే చర్యలన్నీ ఒప్పందాల ఉల్లంఘనకు కారణమౌతున్నాయని ఆ దేశ విదేశాంగ మంత్రి వాంగ్ యీ వద్దకు తీసుకొచ్చారు. చైనా వైఖరి వల్ల 1993, 1996 మధ్య కుదిరిన ఒప్పందాలకు ఎలాంటి విలువా లేకుండా పోతోందని, తరచూ ఉల్లంఘనలకు గురవుతున్నాయని జైశంకర్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలను నివారించడానికి ఈ రెండు ఒప్పందాలను అమలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సరిహద్దుల్లో భారీ సంఖ్యలో సైన్యాన్ని మోహరింపజేయడం ఈ ఒప్పందాల ఉల్లంఘన కిందికి వస్తుందని భావిస్తున్నామని తెలిపారు.
Recommended Video
సరిహద్దుల్లో మోహరింపు..
వాస్తవాధీన రేఖ వెంబడి భారీగా సైన్యాన్ని మోహరింపజేయడం, యుద్ధసామాగ్రిని తరలించడం వంటి చర్యలనూ జైశంకర్ తప్పు పట్టారు. అలాంటి చర్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని, యుద్ధానికి ప్రేరేపించేలా చేస్తున్నాయనీ పేర్కొన్నారు. వెంటనే సైన్యాన్ని వెనక్కి తరలించాలని సూచించారు. 1993, 1996 నాటి ఒప్పందాల ప్రకారం.. వాస్తవాధీన రేఖ రెండు దేశాల సైనికులు సమాన దూరాన్ని పాటించాల్సి ఉంటుందని, దానికి భిన్నంగా చైనా ప్రవర్తిస్తోందని పేర్కొన్నారు. 1976, 1981ల్లో సరిహద్దు వివాదాలను పరిష్కరించుకోవడానికి శాంతియుత వాతావరణంలో చోటు చేసుకున్నాయని, అదే పరిస్థితినీ కొనసాగించాలనీ సూచించారు.