అమెరికాలో రికార్డు స్థాయిలో ముందస్తు ఓటింగ్... టెన్షన్లో ట్రంప్.. ముందంజలో జో బైడెన్...
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా ముందస్తు ఓటింగ్ చురుగ్గా సాగుతోంది. యూఎస్ ఎలక్షన్ ప్రాజెక్ట్ డేటా ప్రకారం... మంగళవారం(అక్టోబర్ 13) నాటికి 10.6మిలియన్ల మంది ఓటర్లు వ్యక్తిగతంగా లేదా మెయిల్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గత 2016 అధ్యక్ష ఎన్నికల్లో ఇదే సమయానికి 1.4మిలియన్ల మంది ఓటు హక్కును వినియోగించుకోగా... ఈసారి ఆ సంఖ్య రికార్డు స్థాయిలో పెరగడం గమనార్హం. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల సమయానికి భారీ క్యూ లైన్లలో నిలుచుని రిస్క్ చేయడం కంటే ముందస్తు ఓటింగ్ను ఉపయోగించుకోవడమే బెటర్ అని చాలామంది భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారణంగానే ఈసారి దాదాపు 10 రెట్లు ముందస్తు ఓటింగ్ పెరిగింది.
ఇప్పటికైతే డెమోక్రాట్లదే పైచేయి...
ఇప్పటివరకూ జరిగిన ముందస్తు ఓటింగ్లో డెమోక్రాటిక్ పార్టీనే ముందంజలో ఉన్నట్లు యూఎస్ ఎలక్షన్ ప్రాజెక్టుకు నేత్రుత్వం వహిస్తున్న ఫ్లోరిడా యూనివర్సిటీ ప్రొఫెసర్ మైకెల్ మెక్ డొనాల్డ్ తెలిపారు. ఇప్పటివరకూ 4.6మిలియన్ల మంది మెయిల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటును నమోదు చేయగా... ఇందులో 2.6మిలియన్ల ఓట్లు డెమోక్రాట్లకే పోలైనట్లు చెప్పారు. అయితే అంతిమంగా వెలువడే ఫలితాలకు ఇదే కొలమానంగా తీసుకోలేమని చెప్పారు.
సమీకరణాలు మారే ఛాన్స్...
'అవును ఇప్పటివరకూ పోలైన ఓట్లు జో బైడెన్కు అనుకూలంగా ఉన్నాయి. అయితే అమెరికా వ్యాప్తంగా 46 మిలియన్ల మెయిల్ బ్యాలెట్స్ ఇంకా తమకు అందాల్సి ఉంది. ఇప్పటివరకూ చాలామంది యువత ఇంకా మెయిల్ బ్యాలెట్స్ను పంపించలేదు. వాళ్లు కూడా ముందస్తు ఓటింగ్ను వినియోగించుకుంటే... ఇప్పుడున్న సమీకరణాలు మారిపోయే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో ఇంకా ఓటు వేయని తమ మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని పార్టీలు తమ ఎలక్షన్ క్యాంపెయిన్స్ నిర్వహించే అవకాశం ఉంది.' అని మైకెల్ డొనాల్డ్ చెప్పారు.
Recommended Video
ట్రంప్కు టెన్షన్...
మరోవైపు ముందస్తు ఓటింగ్పై అధ్యక్షుడు ట్రంప్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈమెయిల్ బ్యాలెట్ ద్వారా ఓటర్ ఫ్రాడ్ జరిగే అవకాశం ఉందని వాదిస్తున్నారు. ఇప్పటివరకూ పోలైన ఈమెయిల్ బ్యాలెట్ ఓట్లలో డెమోక్రాటిక్ పార్టీ ముందంజలో ఉండటం కూడా ట్రంప్ అసహనానికి కారణమని తెలుస్తోంది.రానున్న వారాల్లో ముందస్తు ఓటింగ్ మరింతగా పెరిగే అవకాశం ఉండటంతో ఎన్నికల ఫలితాల కోసం నవంబర్ వరకూ వేచి చూసే అవకాశం ఉండకపోవచ్చునన్న వాదన కూడా వినిపిస్తోంది. ఎక్కువమంది ఓటర్లు ముందస్తు ఓటింగ్లో పాల్గొంటే... పోల్ ట్రెండ్స్ ముందే తెలిసిపోతాయని చెబుతున్నారు.