తీవ్ర భూకంపం: 14మంది మృతి, 50మందికిపైగా గాయాలు, నిరాశ్రయులైన వేలాది మంది
జకార్తా: ఇండోనేషియాలోని లోమ్బాక్ దీవిలో ఆదివారం ఉదయం తీవ్ర భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 14మంది చనిపోగా, సుమారు 50మంది గాయపడ్డారు. భూకంప తీవ్రత రిక్టార్ స్కేల్పై 6.4 గా నమోదైంది.
భూకంపం ధాటికి వందల సంఖ్యలో ఇళ్లు దెబ్బతినగా, వేలాది మంది నిరాశ్రయులయ్యారు. భూకంప కేంద్రం భూ ఉపరితలం నుంచి 7 కిలోమీటర్ల లోపల ఉన్నట్లు గుర్తించారు. అధికారులు ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. సుమారు 40 సార్లు భూ ప్రకంపనలు నమోదైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
కాగా, పెద్ద ఆపద ఏదో సంభవించబోతుందని ముందే భావించామని భూకంప కేంద్రానికి సమీపంలో నివసిస్తున్న ఓ వ్యక్తి తెలిపారు. భూకంప తీవ్రత ఎక్కవగా ఉండటంతో తమ ఇంట్లో ఉన్నవాళ్లంతా భయంతో బయటికి పరుగులు పెట్టారని జుల్కిఫ్లి అనే స్థానికుడు తెలిపాడు.
అధికారులు, పోలీసులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.