ఆఫ్ఘానిస్తాన్-పాకిస్తాన్లో భూకంపం: రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదు..ఢిల్లీలో కంపించిన భూమి
ఆఫ్ఘానిస్తాన్లోని హిందూకుష్ పర్వత శ్రేణి కేంద్రంగా భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది. దీని ప్రభావం దేశరాజధాని ఢిల్లీలో కూడా కనిపించింది. ఇక ఆఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్, తూర్పు ఉజ్బెకిస్తాన్లలో భూమి కంపించింది. జమ్ము కశ్మీర్లోని పూంచ్ సెక్టార్లో కూడా భూమి కంపించినట్లు స్థానికులు తెలిపారు.
ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో 6.1తీవ్రతతో భూకంపం సంభవించినట్లు అమెరికా జియోలాజికల్ సంస్థ వెల్లడించింది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదని ఇండోనేషియాలోని డిజాస్టర్ మేనేజ్మెంట్ సంస్థ వెల్లడించింది. అంతేకాదు సునామీ కూడా వచ్చే అవకాశాలు లేవని నివేదికలో వెల్లడించింది.
మరో ఘటనలో మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో శుక్రవారం సంభవించిన భూకంపంలో రెండేళ్ల చిన్నారి మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం 4.1, 3.6, 3.5 తీవ్రతతో పాలఘర్ జిల్లాలో మూడు భూకంపాలు సంభవించినట్లు వాతావరణ శాఖ తెలిపింది. గతేడాది నవంబర్ నుంచి భూమి కంపిస్తోందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ పేర్కొంది. పాలఘర్ జిల్లా తాల్సరి తాలూకాలో ఇప్పటి వరకు 10 సార్లు భూమి కంపించిందని అధికారులు తెలిపారు. భూకంపాలను సమీక్షించేందుకు పాల్ఘర్ జిల్లాలో స్థానిక వేదాంతా హాస్పిటల్లో తాత్కాలిక ఫీల్డ్ స్టేషన్లను అధికారులు గతేడాది డిసెంబరులో ఏర్పాటు చేశారు. అనంతరం మరో రెండు తాత్కాలిక స్టేషన్లను డొంగ్రిపాడ మరియు తాల్సరి గ్రామాల్లో ఏర్పాటు చేశారు అధికారులు.