పాకిస్తాన్లో భారీ భూకంపం, రిక్టర్ స్కేల్పై తీవ్రత 5.8గా నమోదు
పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ కేంద్రంగా మంగళవారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.8గా నమోదైంది. దాదాపు 8 నుంచి 10 సెకన్ల వరకు భూమి కంపించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక పాకిస్తాన్లో పలు నగరాల్లో భూప్రకంపనలు కనిపించాయి. భూమి కంపిస్తుండటంతో ప్రజలు ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు. పాకిస్తాన్లోని సియాల్ కోట్, సర్గోదా, మాన్సెహరా, గుజ్రాత్, చిత్రాల్, మాలాకంద్, ముల్తాన్, శంగ్లా, బజౌర్, స్వాత్, సహీవాల్, రహీహ్ యార్ ఖాన్, మీర్పూర్లలో భూమి కంపించినట్లు సమాచారం.
అమెరికా జియాలాజికల్ సర్వే ప్రకారం సాయంత్రం నాలుగు గంటల తర్వాత వ్యవసాయ భూమి కలిగిన పంజాబ్, ఆజాద్ కశ్మీర్ను వేరు చేసే ఉత్తర జేలూం ప్రాంతంలో భూకంపం వచ్చింది. 10 కిలోమీటర్ల లోతుకు భూమి చీలినట్లు సమాచారం. ఎక్కువగా పంజాబ్ ప్రావిన్స్లోని ఖైభర్ పక్తుంఖ్వా ప్రాంతంలో భూమి కంపించిన దృశ్యాలు వెలుగు చూశాయి. మీర్పూర్ పాక్ ఆక్రమిత కశ్మీర్లలో ఎక్కువగా ధ్వంసమైనట్లు తెలుస్తోంది. మీర్పూర్లో భూమి కంపించడంతో కనీసం 50 మందికి తీవ్రగాయాలయ్యాయని ప్రత్యక్ష సాక్షి చెప్పాడు. కొన్ని ప్రాంతాల్లో గోడలు కూలినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే భారత్ - పాక్ సరిహద్దుల్లో సంభవించిన భూకంపంతో ఆ ప్రభావం ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానాల్లో కనిపించింది. పాకిస్తాన్లో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 5.8గా నమోదైనట్లు పాక్ వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే పాకిస్తాన్ ఆర్మీ సహాయక చర్యలకు దిగింది. మెడికల్ ఎక్విప్మెంట్స్తో భూకంప సంభవించిన ప్రాంతాలకు చేరుకుంది. గతంలో కూడా ప్రకృతి ప్రకోపానికి పాక్ విలవిలలాడింది. 2015లో 7.5 తీవ్రతతో పాకిస్తాన్ - ఆఫ్ఘానిస్తాన్ సరిహద్దులో భూకంపం రావడంతో 400 మందికి పైగా మృతి చెందారు. పాకిస్తాన్లో భూకంపం బారిన పడి ఐదుగురు మృతి చెందినట్లు తెలుస్తోంది అయితే భారత్లో మాత్రం ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు . ఇళ్లల్లో వస్తువులు కదులుతుండటంతో గ్రహించిన ప్రజలు భూకంపం వస్తుందని భావించి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బయటకు పరుగులు తీశారు.