ఈస్టర్ నాడు టెర్రర్: 8 చోట్ల మహోగ్రదాడులు: 207 మంది మృతి: వణికిన శ్రీలంక
కొలంబో: ఈస్టర్ సండే. క్రైస్తవ సామాజిక వర్గానికి పవిత్రమైన రోజు. సమస్త మానవాళికి అహింసను ప్రబోధించిన జీసస్ పునరుజ్జీవితుడవుతాడని భావించే సుదినం. అలాంటి రోజు..లంకేయులకు పీడకలను మిగిల్చింది. దశాబ్దాల పాటు లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్టీటీఈ) పోరాటాలను చవి చూసిన తరువాత.. దాదాపు పదేళ్ల నుంచీ ప్రశాంత జీవనాన్ని గడుపుతున్న లంకేయులకు ఉగ్రవాదాన్ని పరిచయం చేసిన రోజు. ఎల్టీటీఈ పోరాటాన్ని పక్కన పెడితే.. ఇంత పెద్ద ఎత్తున మారణకాండ చోటు చేసుకున్న ఘటనలు బహుశా శ్రీలంక చరిత్రలోనే ఉండకపోవచ్చు.
చర్చ్ లు, హోటళ్లే టార్గెట్..
ఈస్టర్ సండేను పురస్కరించుకని ఎనిమిది వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మాహూతి దాడులు చోటు చేసుకున్నాయి. ఈ ఉదయం 8:45 నిమిషాలకు తొలిసారిగా పేలుళ్లు సంభవించాయి. ఇక వరుసగా మారణ హోమాన్ని సృష్టించాయి. సెయింట్ ఆంటోనీ ష్రైన్ (కచ్చికడే), సెయింట్ సెబాస్టియన్ చర్చ్ (నెగొంబో), జియోన్ చర్చ్ (బట్టికలోవా), హోటల్ సిన్నామన్ గ్రాండ్ (కొలంబో), హోటల్ షాంగ్రిలా (కొలంబో), హోటల్ కింగ్స్ బరి (కొలంబో)ల్లో బాంబు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఆ షాక్ నుంచి తేరుకోకముందే కొలంబో లోని దేహివాలా జూ, డెమాటాగోడ ప్రాంతంలోని మహావిలా గార్డెన్స్ లో మధ్యాహ్నం తరువాత వెంట వెంటనే మరో రెండు పేలుళ్లు చోటు చేసుకుంది. ఈ ఎనిమిది ఘటనల్లో పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించింది. 207 మంది మరణించారు. వారిలో 35 మంది విదేశీయులు ఉన్నట్లు గుర్తించారు అక్కడి అధికారులు.
గంటగంటకూ మృతుల సంఖ్య..
మూడు క్రైస్తవ ప్రార్థనా మందిరాలు, మూడు హోటళ్లపై ఉగ్రవాదులు మహోగ్రదాడికి పాల్పడ్డారు. ఆత్మాహూతి దాడులతో అట్టుడికించారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఎనిమిది ప్రాంతాల్లో తమను తాము పేల్చేసుకుని విలయాన్ని సృష్టించారు. జనసమ్మర్థంతో కూడిన ప్రదేశాలను ఆత్మాహూతి దళ సభ్యులు లక్ష్యంగా ఎంచుకోవడం వల్ల.. ప్రాణనష్టం భారీగా చోటు చేసుకుంది. 24, 52, 129, 156, 185, 192... ఇలా అంతకంతకూ మృతుల సంఖ్య పెరుగుతూ వెళ్లింది. 207 వద్ద నిలిచింది. అయినప్పటికీ.. క్షతగాత్రుల్లో చాలామంది పరిస్థితి అత్యంత విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య అక్కడితో ఆగేలా లేదని తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
వణికిన లంక..
అనూహ్యంగా చోటు చేసుకున్న ఆత్మాహూతి దాడిని శ్రీలంక ఏ మాత్రం తట్టుకోలేకపోయింది. చివురుటాకులా వణికిపోయింది. ఆత్మాహూతి దాడులు మిగిల్చిన విషాదం నుంచి తేరుకోలేకపోతోంది. ప్రత్యేక దేశం కోసం ఎల్టీటీఈ పోరాటాలను అతి సమీపం నుంచి చవి చూసిన అనుభవం లంకేయులకు ఉంది. అయినప్పటికీ.. చాపకింద నీరులా చేరిన ఇస్లామిక్ ఉగ్రవాద భూతం సృష్టించిన విధ్వంసాన్ని చూసి, తట్టుకునే నిబ్బరాన్ని కోల్పోయింది. ఏ ఒక్క లంకేయుడిని కదిలించినా.. వారి కళ్లల్లో దాడుల తాలూకు భయోత్పాతాలే కనిపిస్తున్నాయి. దిగ్భ్రాంతిని తేరుకోలేకపోతున్నారు సింహళీయులు.
ఇస్లామిక్ ఉగ్రవాద భూతం..
ఇప్పటిదాకా ఏ ఉగ్రవాద సంస్థ కూడా ఈ దాడులు తమ బాధ్యతేనంటూ ప్రకటించుకోలేదు. అయినప్పటికీ.. ఈ మహోగ్ర దాడుల వెనుక ఇస్లామిక్ గ్రూపుల హస్తం ఉందంటూ నిర్ధారించారు అక్కడి భద్రతా బలగాలు. ఆ దిశలో తమ దర్యాప్తును ముమ్మరం చేశారు. ఏడుమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నేషనల్ తౌహీత్ అనే సంస్థ ఈ దాడులకు పాల్పడి ఉండొచ్చంటూ ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ విషయాన్ని శ్రీలంక ప్రభుత్వం అధికారికంగా ఇంకా ప్రకటించలేదు.
ప్రపంచ దేశాల బాసట..
శ్రీలంకను వణికించిన ఆత్మాహూతి దాడుల పట్ల వాటికన్ సిటీ సహా ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది. అండగా ఉంటామని భారత్ సహా ప్రపంచ దేశాలన్నీ ఆ చిరు దేశానికి భరోసా కల్పించాయి. సహాయ, సహకారాలకు అవసరమైన సామాగ్రిని చేరవేశాయి. భారత్ సహా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, పాకిస్తాన్ వంటి దేశాలు శ్రీలంకకు మద్దతు పలికాయి.
జనసమ్మర్థంతో కూడిన ప్రాంతాలే..
ఆత్మాహూతి దాడులు చోటుచేసుకున్న ప్రదేశాలన్నీ జనసమ్మర్థంతో కూడుకున్నవే కావడం వల్ల అంచనాకు మించిన ప్రాణనష్టం చోటు చేసుకుంది. చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించడానికి వచ్చిన భక్తులు, పర్యాటక ప్రదేశాలను తిలకించడానికి వచ్చిన విదేశీయులే టార్గెట్ గా దాడులు యథేచ్ఛగా కొనసాగాయి. ప్రాణాంతక దాడులు చోటు చేసుకునే అవకాశం ఉందంటూ పదిరోజుల కిందటే ఇంటెలిజెన్స్ విభాగం అధికారులు హెచ్చరించినప్పటికీ.. అక్కడి ప్రభుత్వం పట్టించుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.