కరోనాలా ఎబోలా వైరస్ కూడా విజృంభిస్తోందా..? అక్కడ ఎబోలాతో ఎంతమంతి మృతి చెందారంటే..?
2020వ సంవత్సరం ప్రపంచదేశాలకు బ్యాడ్లక్ ఇయర్గా నిలిచిపోనుంది. ఇప్పటికే పలు రూపాల్లో ప్రపంచ దేశాలు ఇబ్బంది పడ్డాయి. ఇప్పటి వరకు ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనావైరస్ ముప్పు పూర్తిగా తొలిగిపోక ముందే మరో పాత వ్యాధి తిరిగి పంజా విసురుతోంది. అదే ఎబోలా. కాంగోలో తిరిగి ఎబోలా క్రమంగా విజృంభిస్తోంది. ఇప్పటికే ఈ దేశంలో ఐదుగురు ఈ వ్యాధి బారిన పడి మృతి చెందినట్లు కాంగో ఆరోగ్యశాఖ మంత్రి ఎటెనీ లాంగాండో చెప్పారు.
Recommended Video
భారత్లో కరోనావైరస్: ఫలితం తేల్చనున్న 'మే’, నిపుణుల సూచనిలివే..
కాంగోలో విరుచుకుపడుతోన్న ఎబోలా
వరస మహమ్మారిలతో ప్రపంచ గడగడలాడుతోంది. కరోనావైరస్ ప్రపంచాన్ని కాటేసిన కొన్ని నెలలకే ఎబోలా మానవజాతిని కబళించేందుకు పరుగులు పెడుతోంది. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి కాంగో దేశంలో ఐదుగురు మృతి చెందారు. వీరంతా ఈక్వేటియర్ ప్రావిన్స్ బందాకా నగరంలో మృతి చెందినట్లు కాంగో ఆరోగ్య శాఖ మంత్రి లాంగాండో తెలిపారు. ఇంకా నలుగురిలో ఎబోలా లక్షణాలు కనిపించినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే ఈక్వేటియర్ ప్రాంతంలో ఎబోలా వైరస్ చివరిసారిగా 2018లో బయటపడిందని హెల్త్ మినిస్టర్ చెబుతున్నారు. ఆ సమయంలో 54 కేసులు నమోదు కాగా 33 మరణాలు సంభవించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ఇక కాంగోలోని తూర్పు ప్రాంతంలో ఎబోలా నుంచి విముక్తి పొందేందుకు ఆ దేశం ఇంకా కష్టపడుతోంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా తూర్పు కాంగో ప్రాంతంలో ఎబోలా వైరస్ బారిన పడి 2260 మంది మృతి చెందారు. అప్పటికే రెండు వ్యాక్సిన్లు వాడుకలోకి వచ్చినప్పటికీ మరణాల సంఖ్యను మాత్రం నిలువరించలేకపోయాయి. ఈ సారి మృతి చెందిన ఐదుగురిలో ఒక 15 ఏళ్ల అమ్మాయి కూడా ఉండటం విశేషం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోంది..?
బందాకా నగరంలో మొత్తం ఆరు ఎబోలా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ టెడ్రాస్ ట్వీట్ చేశారు. ఇది అత్యంత ప్రమాదకరమైన వైరస్ అని చెప్పిన టెడ్రాస్ మనిషి నుంచి మరో మనిషికి శారీరక ద్రవాల ద్వారా వ్యాప్తి చెందుతుందని చెప్పారు. ఇక 25శాతం నుంచి 90 శాతం వరకు ప్రాణాలకు ముప్పు ఉంటుందని హెచ్చరించారు. ఎబోలా వస్తే దాని ఇంక్యుబేషన్ సమయం 21 రోజులు. ఈ సమయంలో కేసులు లేకపోతే ఎబోలా నియంత్రణలో ఉంటుందని ప్రకటించడం జరుగుతుంది. కానీ కాంగోలో ఉన్న తీవ్రత దృష్ట్యా ప్రపంచ ఆరోగ్య సంస్థ 42 రోజులకు ఇంక్యుబేషన్ సమయం పొడిగించింది.
గబ్బిలాల నుంచి కొత్తగా వ్యాధులు
ఎబోలా వైరస్ గబ్బిలాల నుంచి సోకుతుందని చెప్పిన ప్రపంచ ఆరోగ్య సంస్థ కాంగోలో మరిన్ని కొత్త వ్యాధులు పుట్టుకువచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇప్పటి వరకు 2014-16వ సంవత్సరాల మధ్య ఎబోలా వైరస్ తీవ్రంగా ఉన్నిందని ప్రపంచ ఆరోగ్యసంస్థ గుర్తుచేసింది. ఆ సమయంలో పశ్చిమ ఆఫ్రికా దేశాలైన లైబేరియా, సియేరా లియోన్ మరియు గినియాలో ఎక్కువగా ఉన్నింది. ఆ సమయంలో 28వేలకు పైగా ఈ వ్యాధి సోకగా 11వేలకు పైగా మృతి చెందారు.
కాంగోలో ఎబోలా మళ్లీ ఎలా వచ్చింది..?
ఇక రెండు నెలల క్రితం తూర్పు కాంగో ప్రాంతం ఎబోలా నుంచి విముక్తి పొందిందనే ప్రకటన చేయాల్సి ఉన్నింది. అయితే అదే సమయంలో కొత్తగా ఒక ఎబోలా కేసు బయటపడటంతో ఎబోలా మహమ్మారినుంచి విముక్తి పొందామనే ప్రకటన కాంగో చేయలేకపోయింది. అయితే ఆ ప్రాంతంలో ఎబోలా చివరి స్టేజ్లో ఉందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే బందాకా నగరంలో ఎబోలా ఎలా వచ్చిందో అనే దానిపై క్లారిటీ లేదని ప్రభుత్వం చెబుతోంది. తూర్పు కాంగో నుంచి ఈ నగరం దాదాపు750 మైళ్లు ఉందని వెల్లడించింది. ఇక కాంగోలో కోవిడ్-19 కూడా విశ్వరూపం చూపిస్తోంది. మే 31 నాటికి 3195 కేసులు నమోదు కాగా ఇందులో 72 మంది మృత్యువాత పడ్డారు. అయితే ఈక్వేటీయర్ ప్రాంతంలో మాత్రం కోవిడ్ కేసులు నమోదు కాకపోవడం విశేషం.