మోడీ అలా చేయాల్సిందే, వీరాభిమానిని: ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీకి తాను వీరాభిమానిని అని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ అన్నారు. మోడీ నేతృత్వంలో భారత్ అద్భుతంగా దూసుకెళ్తోందన్నారు. గొప్ప గొప్ప నేతలు చేయాలనుకున్న పనిని ప్రధాని మోడీ చేశారన్నారు.
ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించుకున్నారని, ఈ లక్ష్యాలకు డెడ్ లైన్ విధించుకున్నారు. వాటికి ఉద్యోగులు, అధికారులు, సిబ్బందిని బాధ్యులను చేస్తున్నారని, మంచి ఫలితాలను రాబట్టాలంటే అలా చేయాల్సిందేనన్నారు. అవన్నీ ఆయన చేస్తున్నారు కాబట్టే మోడీకి వీరాభిమానిని అయ్యానని చెప్పారు.
మోడీ పనితనం తమకు సవాల్ విసురుతోందన్నారు. వ్యాపారానికి అనుకూలమైన పరిస్థితులున్న దేశాలకు సంబంధించి తాము విడుదల చేసిన జాబితాలో.. భారత్ స్థానం 2014లో 54 కాగా, 2016లో భారత్ 35వ స్థానానికి చేరుకుందన్నారు.
పోర్చుగల్ కన్నా భారత్లోనే మెరుగైన వ్యాపార అనుకూల పరిస్థితులున్నాయన్నారు. మోడీ కృషి ఫలిస్తుందనటానికి ఇవి సంకేతాలని, ఆయన నాయకత్వంలో భారత్ గొప్పగా ముందుకెళ్తొందన్నారు. ప్రపంచబ్యాంకును తాము అర్థం చేసుకున్నదానికన్నా మోడీనే బాగా అర్థం చేసుకున్నారన్నారు.
రెండు రోజుల భారత పర్యటనలో ఉన్న ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ చివరిరోజైన గురువారం ప్రధానమంత్రి మోడీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. పోషకాహారం, పునర్వినియోగ ఇంధనాల రంగంలో భారత్కు పూర్తిస్థాయిలో తమ సహకారం ఉంటుందన్నారు.
భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధిచెందుతున్న ప్రధాన ఆర్థికవ్యవస్థ అని, ఐరోపా కూటమి నుంచి బ్రిటన్ విడిపోతున్న నేపథ్యంలో తలెత్తిన పరిస్థితుల్లోనూ భారత్ స్థిరంగా ఉందంటూ హర్షం వెలిబుచ్చారు. ద్రవ్యోల్బణం కూడా తగ్గుముఖం పడుతోందని, వృద్ధిరేటు గొప్పగా ఉందని, ఆర్థికరంగంపరంగా చూస్తే ప్రధాని మోడీ పనితీరు చాలా బాగుందని కొనియాడారు.
ఇదిలా ఉండగా, మనదేశంలో నిర్మించనున్న సౌరశక్తి ప్రాజెక్టులకు రూ.6,750 కోట్ల రుణం ఇవ్వటానికి ప్రపంచబ్యాంకు అంగీకరించింది. ఇప్పటి వరకూ ఏ దేశానికీ సౌరశక్తి ప్రాజెక్టుల కోసం ఇంత భారీమొత్తాన్ని ప్రపంచబ్యాంకు ఇవ్వలేదు. తొలిసారిగా భారత్కే ఈ స్థాయిలో ఇవ్వటం విశేషం. ఈ మేరకు కేంద్ర విద్యుత్శాఖ మంత్రి పీయూష్ గోయల్, ప్రపంచబ్యాంకు అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ ఒక ఒప్పందంపై సంతకాలు చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీకి తాను వీరాభిమానిని అని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్ యాంగ్ కిమ్ అన్నారు. మోడీ నేతృత్వంలో భారత్ అద్భుతంగా దూసుకెళ్తోందన్నారు. గొప్ప గొప్ప నేతలు చేయాలనుకున్న పనిని ప్రధాని మోడీ చేశారన్నారు. ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించుకున్నారని, ఈ లక్ష్యాలకు డెడ్ లైన్ విధించుకున్నారు.