ఈక్వడార్లో భారీ భూకంపం: రిక్టర్ స్కేలుపై తీవ్రత 7.7గా నమోదు
ఈక్వడార్లో భారీ భూకంపం సంభవించింది. పెరూతో సరిహద్దు చేసే ప్రాంతంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 7.7గా నమోదైంది. సరిహద్దుల్లో భూకంపం రావడంతో ఆ ప్రభావం రెండు దేశాలపై పడింది. ఈక్వడార్, పెరూ దేశాల్లో భూకంప ప్రభావం స్పష్టంగా కనిపించింది. అంతేకాదు ఈ భారీ భూకంపం దాటికి దక్షిణ అమెరికాలో కూడా కొన్ని చోట్ల ప్రభావం కనిపించినట్లు అమెరికా వాతావరణ శాఖ తెలిపింది.
భూకంపం రావడంతో అక్కడి ప్రజలు అలర్ట్ అయ్యారు. ఈక్వడార్లో భూకంపం వచ్చిందని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అయితే భూకంపం ధాటికి జరిగిన నష్టం పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు. ఓ వ్యక్తి నిద్రలో ఉండగా తను పడుకున్న మంచం కదులుతూ ఉండటం గమనించి లేచి చూసినట్లు చెప్పారు. అంతలోనే కిటికీ అద్దాల్లో చీలిక రావడం గమనించి బయటకు పరుగులు తీసినట్లు సోషల్ మీడియాలో తన అనుభవం గురించి చెప్పాడు. చాలాసేపు భూమి కంపించిందని ఆ సమయంలో భయంతో వణికిపోయినట్లు ఆ వ్యక్తి వివరించాడు.
భూకంపం స్థానిక కాలమాన ప్రకారం తెల్లవారుజామున ఉదయం 5 గంటల ప్రాంతంలో సంభవించిందని... భవంతి కదులుతున్నట్లు తమకు అనిపించి ఇంటిలోనుంచి బయటకు పరుగులు తీసినట్లు హోటల్ యజమాని ఒకరు తెలిపారు.