ఈజిప్ట్లో పురాతన శ్మశాన వాటికలో 50 మమ్మీలు: చిన్నారులవి, జంతువులవి (వీడియో)
కైరో: ఈజిప్ట్లోని పురాతత్వ శాస్త్రవేత్తలు మరో నలభై నుంచి యాభై మమ్మీలను గుర్తించారు. మిన్యా ప్రాంతంలో ఇటీవల వారు పురాతన శ్మశానాన్ని కనుగొన్నారు. అక్కడ మమ్మీలను గుర్తించారు. ఈ మమ్మీలలో చిన్నపిల్లలు, జంతువులవి కూడా కనుగొన్నారు.
పురాతత్వ శాస్త్రవేత్తలు ఈజిప్ట్లోని మిన్యాలోని ట్యూనా ఎల్ గెబల్ అనే ప్రాంతంలో తొమ్మిది మీటర్ల లోతున గదులను గుర్తించారు. వీటిలో ఈ మమ్మీలు ఉన్నాయి. ఇవి రోమన్ లేదా బైజాన్దియన్ కాలం నాటివిగా భావిస్తున్నారు. ఇందులో కొన్ని వెలికితీశారు.
50 వరకు మమ్మీల గుర్తింపు
ఆ మమ్మీలు మంచిస్థితిలో ఉన్నాయా లేదా తెలియరాలేదని చెబుతున్నారు. మమ్మీల పైన నాటి భాషలో రాసి ఉంది. అయితే వాటిపై ఎలాంటి పేర్లు గుర్తించలేదని చెబుతున్నారు. శనివారం పురావస్తు మంత్రిత్వ శాఖ కూడా స్పందించింది. దాదాపు యాభై వరకు మమ్మీలను గుర్తించినట్లు తెలిపింది. ఇందులో పెద్దవారివి, పిల్లలవి, జంతువులవి ఉన్నాయని చెప్పింది. దక్షిణ కైరోకు 260 కిలో మీటర్ల దూరంలో ఈ మమ్మీలు గుర్తించిన ప్రాంతం ఉందని పురావస్తు మంత్రిత్వ శాఖ తెలిపింది.
మమ్మీల్లో చిన్నారులవి, జంతువులవి
40 మమ్మీలను బయటకు తీశామని, ఇందులో 12 చిన్నారులవి, ఆరు జంతువులవి ఉన్నాయని ఆర్కియాలజిస్ట్ రామి రస్మి తెలిపారు. మిగతావి మహిళలు, పురుషులవి అని చెప్పారు.
మిన్యా యూనివర్సిటీ నేతృత్వంలో
మమ్మీలపై నాటి భాషలో రాసిన విశేషాలు ఉన్నాయని చెప్పారు. ఈజిప్షియన్ కాలంలో దీనిని సాధారణ ప్రజలు వినియోగించేవారన్నారు. ఈ మమ్మీలను చాలా వరకు కుండల్లో భద్రపరిచినట్లు తెలిపారు. మిన్యా యూనివర్సిటీ నేతృత్వంలో చేపట్టిన ఈ సంయుక్త కార్యక్రమంలో తొలిసారి ఈ మమ్మీలను కనుగొన్నారు.