పైకి ఎక్కారు: టెర్రరిస్ట్లుగా భావించి ఈఫిల్ టవర్ క్లోజ్
ప్యారిస్: ఫ్రాన్స్ దేశానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచే ఈఫిల్ టవర్ తాత్కాలికంగా మూతబడింది. ఈఫిల్ టవర్ ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రదేశాల్లో ఒకటి. దీనిని, ఆదివారం ఆకస్మికంగా మూసివేసి, సందర్శకుల ప్రవేశాలపై ఆంక్షలు విధించారు.
భుజాన పెద్ద పెద్ద బ్యాగులు తగిలించుకున్న ముగ్గురు ఆగంతకులు ఆదివారం ఉదయం 5.30 గంటల సమయంలో ఈ టవర్ పైకి వెళ్లినట్లు పోలీసులకు సమాచారం అందింది. వారు ఉగ్రవాదులేమోననే అనుమానంతో సందర్శకులపై ఆంక్షలు విధించారు.
వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఉగ్రవాద నిర్మూలన విభాగ పోలీసులు హెలీకాప్టర్ సాయంతో టవర్ చుట్టూ జల్లెడ పట్టారు. ఎవరూ పట్టుబడకపోయినా ఆగంతకులు పారాచ్యూట్ సాయంతో తప్పించుకుని ఉంటారని అనుమానిస్తున్నారు.
పారిపోయే ముందు ప్రమాదకర పదార్థాలను టవర్పై ఉంచి ఉంటారేమోనని భావించారు. ఇదిలా ఉండగా, వారు బేస్ జంపర్స్గా తేలినట్లుగా తెలుస్తోందని వార్తలు వస్తున్నాయి. పోలీసులకు ఈ విషయమై సమాచారం అందడంతో కొన్ని గంటల పాటు మూసేశారు.