సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్.. 8 మందిని దారుణంగా కొట్టి చంపిన జనం..
ఢాకా : సోషల్ మీడియా... రెండువైపులా పదునున్న కత్తి. దాని వల్ల ఎంత ఉపయోగం ఉందో అదేస్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫేక్ న్యూస్లు కొందరి ప్రాణాల మీదకు తెస్తున్నాయి. తాజాగా బంగ్లాదేశ్లోనూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. సోషల్ మీడియాలో వదంతుల కారణంగా ఒకరు ఇద్దరు కాదు.. ఏకంగా ఎనిమిది మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు.
బ్రిడ్జి నిర్మాణం కోసం పిల్లల బలి
బంగ్లాదేశ్లో ఈ మధ్యకాలంలో ఓ ఫేక్ న్యూస్ వైరల్ అయింది. త్వరలో నిర్మించనున్న ఓ భారీ బ్రిడ్జి కోసం పిల్లల్ని బలి ఇవ్వాలనుకుంటున్నారని అందుకోసం కొందరు వ్యక్తులు చిన్నారుల్ని కిడ్నాప్ చేస్తున్నారన్నది దాని సారాంశం. దీంతో ఆందోళనకు గురైన జనం అనుమానిత వ్యక్తులు కనిపిస్తే చాలు వారిపై మూక దాడులకు పాల్పడుతున్నారు. ఫేస్బుక్లో వైరల్ వదంతుల కారణంగా ఇప్పటి వరకు 2మహిళలు సహా 8మంది చనిపోయారు.
పలువురిని అరెస్ట్ చేసిన పోలీసులు
తాజాగా ఇద్దరు పిల్లల తల్లైన తస్లీమ్ బేగం అనే మహిళను ఢాకా స్కూల్ సమీపంలో కొందరు కొట్టి చంపారు. స్కూల్ పిల్లల్ని కిడ్నాప్ చేసేందుకు పాఠశాల వద్దకు వచ్చిందన్న అనుమానంతో ఈ దారుణానికి పాల్పడ్డారు. ఢాకాలో ఉంటున్న తన కూతురుని చూసేందుకు వచ్చిన ఓ చెవిటి వ్యక్తిని జనం కిడ్నాపర్ అన్న నెపంతో దాడి చేశారు. తీవ్రగాయాలపాలైన ఆయన కన్నుమూశాడు. తల్సీమ్ బేగం కేసులో ఇప్పటి వరకు పోలీసులు ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.
యూట్యూబ్, ఫేస్బుక్, వెబ్సైట్లపై నిఘా
సోషల్ మీడియాలో తప్పుడు వార్తల్ని వైరల్ చేస్తున్న వ్యక్తుల కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. ఇలాంటి వదంతుల్ని సృష్టిస్తున్న ఐదుగురిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశారు. మరో 30 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. బలి కోసం పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారన్న వార్తల్ని ప్రసారం చేసిన 25 యూట్యూబ్ ఛానెళ్లతో పాటు 60 ఫేస్బుక్ పేజీలు, 10 వెబ్సైట్లను మూసివేశారు. అయినా ఆ వార్తలు ఇంకా ఫేస్బుక్లో సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి.