బిన్ లాడెన్ వెళ్లిపో: అమెరికాలో సిక్కు వ్యక్తిపై దాడి
చికాగో: అమెరికాలో భారత సంతతికి చెందిన సిక్కు వ్యక్తి పైన జాత్యాహంకార దాడి జరిగింది. ఈ సంఘటన గత రాత్రి జరిగింది. భారత సంతతికి చెందిన వ్యక్తిని ఉగ్రవాది, బిన్లాడెన్ అంటూ దుండగులు దాడికి పాల్పడ్డారు.
ఇంద్రజిత్ సింగ్ ముక్కర్ అనే సిక్కు వ్యక్తికి అమెరికా పౌరసత్వం ఉంది. ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. స్థానికంగా గ్రాసరీ స్టోర్ పెట్టుకొని జీవనం సాగిస్తున్నాడు. గత మంగళవారం కొందరు వ్యక్తులు ఉగ్రవాది, మీ దేశానికి తిరిగి వెళ్లిపో, బిన్ లాడెన్ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు.
అనంతరం ఇంద్రజిత్పై పలుమార్లు దాడికి పాల్పడ్డారు. అతని ముఖంపై తీవ్రంగా కొట్టారు. దీంతో ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. స్థానికులు అతడిని సమీప ఆసుపత్రికి తీసుకు వెళ్లి చికిత్స చేయించారు. ఆయనకు ఆరు కుట్లు పడ్డాయి.
తన పైన దాడి విషయమై ఇంద్రజిత్ సింగ్ చికాగో పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన పైన అధికారులు స్పందించిన తీరు బాగుందని, అందుకు తాను కృతజ్ఞతలు చెబుతున్నానని ఇంద్రజిత్ సింగ్ అన్నారు.
సిక్కు మత వేషధారణలో ఉండటం వల్ల అతడి జాతీయత కనిపించడంతోనే ఈ దాడి జరిగిందని సిక్కు మత లీగల్ డైరెక్టర్ హర్ సిమ్రన్ కౌర్ అన్నారు. గతంలో సందీప్ సింగ్ అనే వ్యక్తి పైన కూడా న్యూయార్క్లో దాడి జరిగింది. 2012లో సిక్కు వ్యక్తి ఇంట్లోకి జొరబడి కాల్పులు జరిపిన సంఘటన సంచలనం సృష్టించింది.