పైలట్లకు బిగ్ షాక్... 600 మందిని సాగనంపిన ఎమిరేట్స్... ఏవియేషన్ ఇండస్ట్రీలోనే అతిపెద్ద కోత..
కరోనా లాక్ డౌన్ కారణంగా తలెత్తిన నష్టాలను పూడ్చుకునేందుకు చాలా సంస్థలు ఉద్యోగాల కోతపై దృష్టి సారించాయి. పరిశ్రమలు,ఈకామర్స్ దిగ్గజాలు,విమాయాన సంస్థలు.. ఇలా చాలా రంగాలు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపడుతున్నాయి. తాజాగా దుబాయ్ ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎమిరేట్స్ కూడా ఇదే బాట పట్టింది. సంస్థలోని 600 మంది పైలట్లను తొలగించింది. ఇందులో కొంతమంది భారతీయ పైలట్లు కూడా ఉన్నారు. విమానయాన రంగంలో ఇప్పటివరకూ జరిగిన ఉద్యోగాల కోతల్లో ఇదే అతి పెద్దది అని చెబుతున్నారు.
Recommended Video
మొత్తం 792 మందిని సాగనంపిన ఎమిరేట్స్
ఈ ఏడాది మే 31న ఎమిరేట్స్ విమానయాన సంస్థ 180 మంది పైలట్లకు ఉద్వాసన పలికింది. తాజాగా మరో 600 మందిని సాగనంపింది. ఈ ఏడాది ఇప్పటివరకూ మొత్తంగా 792 మంది పైలట్లను ఉద్యోగాల్లో నుంచి తొలగించింది. ఉద్యోగాలు కోల్పోయినవారిలో పైలట్లతో పాటు కేబిన్ క్రూ సిబ్బంది కూడా ఉన్నారు. 'మా వ్యాపారాన్ని తిరిగి నిలబెట్టేందుకు అవసరమైన అన్ని మార్గాలపై చర్చించాం. కానీ ఇప్పుడున్న నష్టాల కారణంగా కొంతమంది ఉద్యోగులకు గుడ్ బై చెప్పక తప్పట్లేదు.' అని ఎమిరేట్స్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
A380 ట్రైనీలే ఎక్కువ..
తాజాగా ఉద్వాసనకు గురైన పైలట్లలో ఎక్కువమంది ఏ380 విమాన శిక్షణ పొందుతున్నారని.. వీరంతా ప్రొబేషన్ పీరియడ్లో ఉన్నారని ప్రముఖ జాతీయ మీడియా వెల్లడించింది. విమానయాన రంగంలో మంచి గుర్తింపు పొందిన ఎమిరేట్స్ జంబో A380 విమాన సర్వీసులతో ప్రపంచంలోనే అతిపెద్ద ఏవియేషన్ ఆపరేటర్గా అవతరించింది. అయితే కరోనా ప్రభావంతో సంస్థలోని మొత్తం 115 A380 విమానాల్లో 40 విమానాలను పక్కన పెట్టేయాలని నిర్ణయించింది.
యాజమాన్యం ఏం చెబుతోంది..
''గతంలో చెప్పినట్టుగా.. ఎమిరేట్స్ సంస్థలో ప్రతిభావంతులైన ఉద్యోగులను నిలుపుకునేందుకు సాధ్యమైనంత మేర ప్రయత్నిస్తున్నాం. అయితే కరోనా కారణంగా తలెత్తిన నష్టాలు,తగ్గిపోయిన కార్యకలాపాల నేపథ్యంలో అదనపు సిబ్బందిని ఇప్పుడు మేము భరించలేమని నిర్ణయించుకున్నాం. ప్రస్తుత కార్యకలాపాలకు సరిపోయే స్థాయిలో మాత్రమే సిబ్బందిని నిలుపుకోవాలనుకుంటున్నాం.' అని సంస్థ స్పష్టం చేశారు.
జూన్ 15.. చివరి తేదీ..
'ఇది అత్యంత క్లిష్ట సందర్భం. కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితిలోకి మేము నెట్టివేయబడ్డాం. ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ పట్ల విచారం వ్యక్తం చేస్తున్నాం. అయితే వారికి మా తరుపు నుంచి సాధ్యమైనంత మేర వారికి అండగా నిలబడే ప్రయత్నం చేస్తాం.' అని తెలిపారు. ఉద్వాసనకు గురైన ఉద్యోగులకు జూన్ 15 చివరి రోజుగా నిర్ణయించారు. కంపెనీ నుంచి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ అందుతాయని చెప్పారు. ఏవియేషన్ ఇండస్ట్రీలో మొత్తం 30వేల మంది ఉద్యోగులు ఉద్వాసనకు గురవుతారని గతంలో కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. ప్రస్తుత పరిణామాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.