వ్యాక్సిన్పై బాంబు పేల్చిన బ్రిటన్ ప్రధాని: ఎన్నో సవాళ్లు: -70 డిగ్రీలు: కరోనా ఆంక్షలు రద్దు
లండన్: బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్.. సంచలన ప్రకటన చేశారు. ఫైజర్ వ్యాక్సిన్ వచ్చేవారం నుంచి సాధారణ ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకుని రాబోతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ను ఇప్పట్లో అందరికీ అందజేయలేమని తేల్చి చెప్పారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ.. చిట్టచివరి వ్యక్తి వరకూ దాన్ని పంపిణీ చేయడానికి కొన్ని నెలల సమయం పట్టొచ్చని వ్యాఖ్యానించారు. ప్రాధాన్యతక్రమంలో వ్యాక్సిన్ను సరఫరా చేస్తామని తేల్చి చెప్పారు.
Recommended Video
కరోనా ఆంక్షలు ఎత్తివేత
కరోనా వైరస్ను నిర్మూలించడానికి ఫైజర్ వ్యాక్సిన్కు అనుమతి ఇచ్చిన అనంతరం బోరిస్ జాన్సన్.. దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కరోనా వైరస్ ఆర్థిక సంక్షోభ పరిస్థితులకు దారి తీసిందని పేర్కొన్నారు. ఆర్థిక రంగం పురోగమింపజేయడానికి కొన్ని కీలక నిర్ణయాలను తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్నప్పటికీ.. ఆంక్షలను తొలగించాల్సి వచ్చిందని అన్నారు. కరోనా వ్యాప్తిని నివారించడానికి అమల్లోకి తీసుకొచ్చిన ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు బోరిస్ జాన్సన్ తెలిపారు. ప్రజలు.. ఆంక్షలను మాత్రమే ఎత్తేశామని, శానిటైజైషన్ను కొనసాగిస్తున్నామని చెప్పారు.
ఆర్థిక కార్యకలాపాలను కొనసాగించాల్సిన అవసరం..
దేశంలో ఆర్థిక కార్యకలాపాలను పునరుద్ధరించాల్సిన అవసరం ఏర్పడిందని బోరిస్ జాన్సన్ చెప్పారు. ఆంక్షలను ఎత్తేసినప్పటికీ.. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాల్సి ఉంటుందని అన్నారు. చేతులను శుభ్రం చేసుకోవడం, మాస్కులను ధరించడం తప్పనిసరిగా కొనసాగించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. కరోనా వ్యాప్తి చెందకుండా నివారించడానికి ప్రజలు తమ వ్యక్తిగత స్వేచ్ఛను త్యాగం చేయక తప్పదని అన్నారు. తాము ప్రేమించే వారి కోసం, తమ తోటి వారి కోసం మాస్కులను ధరించడం, చేతులను శుభ్రం చేసుకోవడం కొనసాగించాలని సూచించారు.
మైనస్ 70 డిగ్రీలు..
ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి తమ ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని, ఇప్పటికిప్పుడు ప్రతి ఒక్కరికీ దాన్ని అందించడం కష్టసాధ్యమౌతుందని పేర్కొన్నారు. వ్యాక్సిన్ను రవాణా చేయడం సవాళ్లతో కూడుకున్న అంశమని చెప్పారు. లాజిస్టిక్ సమస్యలను అధిగమించాల్సి ఉందని, దీనికోసం సమగ్ర బ్లూప్రింట్ను సిద్ధం చేస్తున్నామని అన్నారు. వ్యాక్సిన్ను మైనస్ 70 డిగ్రీల వద్ద నిల్వ ఉంచి, రవాణా చేయాల్సి ఉంటుందని, ఆ తరువాత కూడా దాన్ని అదే ఉష్ణోగ్రతలో నిల్వ చేయడం సవాల్గా మారిందని చెప్పారు.
అత్యుత్సాహం వద్దు..
వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతోనే కరోనా వైరస్పై తాము సాగిస్తోన్న యుద్ధం ముగిసిపోయినట్టుగా భావించొద్దని బోరిస్ జాన్సన్ సూచించారు. కరోనాపై ఇంకా సుదీర్ఘపోరును కొనసాగించాల్సిన అవసరం ఉందని చెప్పారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందనే అత్యుత్సాహం పనికి రాదని స్పష్టం చేశారు. కరోనా బారి నుంచి బయటపడటానికి ప్రతి ఒక్కరు మూడువారాల వ్యవధిలో రెండు ఇంజెక్షన్లను వేయించుకోవాల్సి ఉంటుందని, ఈ పరిస్థితుల్లో అందరికీ వాటిని అందుబాటులోకి తీసుకుని రావడానికి సమయం పడుతుందని చెప్పారు.