డోక్లాంపై జోక్యం చేసుకోం, భారత్, చైనా తేల్చుకోవాల్సిందే: అమెరికా
భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు ఆ రెండు దేశాలు ముఖాముఖి చర్చలు జరపాలని అమెరికా సూచించింది.
వాషింగ్టన్: భారత్, చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల్ని తగ్గించేందుకు ఆ రెండు దేశాలు ముఖాముఖి చర్చలు జరపాలని అమెరికా సూచించింది. ఇదరు దేశాల మధ్య చర్చల్ని అమెరికా ప్రోత్సహిస్తోందని ఆ దేశ రక్షణ శాఖ ప్రతినిధి గ్యారీ రాస్ చెప్పారు.
అయితే ఈ వివాదంలో అమెరికా ఎవరికీ మద్దతుగా నిలువదని ఆయన ప్రకటించారు. ఇరుదేశాలు నేరుగా ఈ సమస్యను పరిష్కరించుకోవాలని కోరుతున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ అంశంపై అమెరికాకు ఎలాంటి అభిప్రాయాలు లేవన్నారాయన.
గత కొన్ని రోజులుగా అమెరికా విదేశాంగ శాఖ కూడ ఇదే అభిప్రాయాన్ని వెల్లడిస్తోంది. సిక్కిం సరిహద్దులోని డోక్లాం ప్రాంతంలో భారత, చైనాలు సైన్యాన్ని మోహరించాయి. గత నెలరోజుల నుండి ఉద్రిక్తత కొనసాగుతున్నాయి.
ట్రై జంక్షన్ ప్రాంతంలో భూటాన్ సరిహద్దులో చైనా రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకొనేందుకు భారత్ తన సైన్యాన్ని మోహరించింది. మరోవైపు జూలై 27, 28 తేదిల్లో చైనాలో జరిగే బ్రిక్స్ దేశాల ఎన్ఎస్ఏ అధినేతల భేటీ కోసం భారత జాతీయ భద్రతా సలహదారు అజిత్ధోవల్ బీజింగ్ వెళ్ళనున్నారు.
ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలపై ఈ పర్యటనలో ఆయన చర్చించే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఈ మేరకు చైనా విశ్లేషకుడు మా జిలాయ్ అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది సెప్టెంబర్లో గ్జియామెన్లో జరిగే బ్రిక్స్ అధినేతలు సదస్సుకు సన్నాహంగా ఎన్ఎస్ఏ అధినేతల భేటీని నిర్వహిస్తున్నారు.