అమెరికా పై దాడి నేరుగా కాదా? ఉత్తరకొరియా ‘కిమ్’ ప్లానే వేరు! ఆ క్షిపణి పరీక్ష విఫలమవలేదు, అంతా నాటకం
అమెరికా హెచ్చరికలను సైతం లెక్క చేయకుండా ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఆ మధ్యన ఓ భారీ క్షిపణి పరీక్షను నిర్వహించిన విషయం గుర్తుంది కదా? ప్రయోగానంతరం
వాషింగ్టన్్: అమెరికా హెచ్చరికలను సైతం లెక్క చేయకుండా ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఆ మధ్యన ఓ భారీ క్షిపణి పరీక్షను నిర్వహించిన విషయం గుర్తుంది కదా? ప్రయోగానంతరం ఆ క్షిపణి పరీక్ష విఫలమైనట్లు ఉత్తరకొరియా ప్రకటించింది కూడా. కానీ దీనివెనుక దాగి ఉన్న ఓ పెద్ద గుట్టు ఇప్పుడు బహిర్గతమైంది.
ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగం విఫలం కాలేదని, దానిని ఆ దేశాధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాల ప్రకారం కావాలని గగనతలంలోనే పేల్చివేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక పక్కా ప్రణాళిక కూడా ఉందని అమెరికా ఇంటలిజెన్స్ సంస్థ సీఐఏ మాజీ చీఫ్ జేమ్స్ వూస్లీ భావిస్తున్నారు.
అంత ఎత్తులో పేలిపోతే...
ఉత్తరకొరియా ఆనాడు ప్రయోగించిన క్షిపణి భూ ఉపరితలం నుంచి 71 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లిన తర్వాత పేలిపోయింది. దీని గురించి జేమ్స్ వూస్లీ మాట్లాడుతూ, ఒకవేళ ఇంత ఎత్తులో ఓ అణ్వాయుధం పేలిపోతే జరిగే విపత్తు అంతా ఇంతా కాదని తెలిపారు.
అమెరికాకు పొంచి ఉన్న అపాయం...
అత్యంత ఎత్తులో జరిగే ఈ న్యూక్లియర్ విస్ఫోటనం వల్ల వెలువడే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ రేడియేషన్ వల్ల లక్షలాది మంది ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందట. ఉత్తరకొరియా చేసిన ఆ భారీ క్షిపణి పరీక్ష కూడా ఇలాంటిదేనని, దానివల్ల అమెరికాకు తీవ్రమైన అపాయం పొంచి ఉందని జేమ్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పవర్ గ్రిడ్ లే టార్గెట్ గా...
ఈ రకమైన దాడుల వల్ల భూమ్మీద ఉన్న పవర్ గ్రిడ్ లు ఎందుకూ పనికిరాకుండా పోతాయట. ఫలితంగా.. విద్యుత్తుతో అనుసంధానమైన అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోతాయట. తినటానికి తిండి, తాగటానికి నీరు కూడా లభించవని జేమ్స్ వూస్లీ తెలిపారు. ఇంకా బ్యాంకింగ్, టెలీకమ్యూనికేషన్స్, మెడిసిన్, ఇలా అన్ని వ్యవస్థలు స్తంభించిపోతాయట.
గతంలో అమెరికా కూడా...
అయితే ఇలాంటి దాడుల వల్ల దెబ్బతినకుండా అమెరికా మిలిటరీకి సంబంధించిన పరికరాలు, వ్యవస్థలకు రక్షణ ఉంది కానీ.. పవర్ గ్రిడ్ లకు మాత్రం ఈ రక్షణ వ్యవస్థ లేదట. దీనికి గతంలో జరిగిన ఓ ఘటనను సీఐఏ మాజీ చీఫ్ జేమ్స్ వూస్లీ ఉదాహరణగా చెబుతున్నారు. గతంలో పసిఫిక్ మహా సముద్రంలో ఇలాంటి హై-ఆల్టిట్యూడ్ టెస్టును అమెరికాయే నిర్వహించిందని... దాని దెబ్బకు హవాయిలో విద్యుత్ కు తీవ్ర అంతరాయం ఏర్పడిందని కూడా ఆయన గుర్తు చేశారు.
ఇదేనా ‘కిమ్’ అసలు ప్లాను?
మొత్తానికి ఈయన చెప్పిన వివరణ వింటుంటే... ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ వ్యూహం ఏమిటో క్లియర్ గా అర్థమవుతోంది. భూమి మీద ఉన్న లక్ష్యాలపై నేరుగా దాడి చేయకుండా... అంతకన్నా ఎక్కువ వినాశనానికి కారణమయ్యే దిశగా కిమ్ అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ట్రంప్ ఏం చర్య తీసుకుంటారో?
అగ్రరాజ్యం అమెరికాను నేరుగా కాకుండా ఆకాశంలో ఎంతో ఎత్తున న్యూక్లియర్ మిసైల్స్ ను పేల్చి, భూమ్మీద విధ్వంసం సృష్టించే దిశగా ఉత్తర కొరియా పరీక్షలు నిర్వహిస్తోందన్నమాట. మరి ఈ విషయం తెలిశాక అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో?