‘టైటానిక్’అనుభూతి మీరూ ప్రత్యక్షంగా పొందొచ్చు
టైటానిక్ ఓడలో ప్రయాణించి.. అది మునిగిపోయినప్పుడు ఏం జరిగిందో ప్రత్యక్షంగా అనుభూతి మీరూ పొందొచ్చు.
కాలిఫోర్నియా: టైటానిక్ ఓడ విషాదం అందరికీ తెలిసిందే. 2,224 మందితో ప్రయాణం మొదలుపెట్టిన టైటానిక్ సముద్ర మార్గంలో మంచుకొండను ఢీకొని మునిగిపోయింది. ఇదంతా మనం వార్తల్లో చదివాం.. సినిమాగా కూడా చూశాం. . ఇంకా మ్యూజియాల్లో పెడితే తిలకించాం.
టైటానిక్ ఓడ ప్రమాదంలో 1500 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో తలచుకుంటే భయమేస్తుంది. మరి అదే పరిస్థితిలో మీరుండి ప్రత్యక్షంగా అ అనుభూతిని పొందితే ఎలా ఉంటుంది?
ఒకసారి ట్రై చేస్తామంటారా? అయితే ఇంకెంత.. ఒక్క ఏడాది ఆగండి. ఆ తర్వాత మీరూ టైటానిక్ లో ప్రయాణించి ఓడ మునిగిపోయినప్పుడు ఏం జరిగిందో ప్రత్యక్షంగా అనుభూతి పొందొచ్చు.
లెక్స్ పార్కర్ డిజైన్ కన్సల్టేషన్ లిమిటెడ్ అనే సంస్థ ఒంటారియోలోని నయాగరా జలపాతం వద్ద 'ఎక్స్ పీరియన్స్ టైటానిక్' పేరుతో ఓ మ్యూజియం ఏర్పాటు చేస్తోంది. ఈ మ్యూజియంలోకి ప్రవేశిస్తే నిజమైన టైటానిక్ ఓడలోకి వెళ్లినట్లుగానే ఉంటుందట.
బాయిలర్ గదులు, థర్డ్ క్లాస్ క్యాబిన్లు, ఫస్ట్ క్లాస్ క్యాబిన్లు, ఇంజిన్ గది.. అన్నీ అచ్చం అలాగే ఉంటాయట. మ్యూజియాన్ని సందర్శించడానికి వచ్చిన వారికి మొదట నిజమైన టైటానిక్ లో ప్రయాణించిన వారి వివరాలు తెలిపే కరపత్రాలు అందిస్తారట.
అనంతరం పోర్టు నుంచి టైటానిక్ ఓడ బయలుదేరిన సన్నివేశాలను అక్కడి తెరపై చూపిస్తారు. అప్పడు సందర్శకులకి నిజంగానే పోర్టుకి దూరంగా వెళ్తున్న అనుభూతి కలుగుతుందట
ఆ తర్వాత టైటానిక్ ఓడ మంచుకొండను ఎలా ఢీకొట్టిందో.. స్టిమ్యులేటర్ సహాయంతో అచ్చం అలాంటి ప్రమాదాన్నే సృష్టిస్తారు. ఢీకొన్నప్పుడు వచ్చిన శబ్దాలు, ప్రయాణికుల అరుపులు ప్రత్యేక ఆడియో సిస్టం ద్వారా వినిపిస్తారు.
ప్రమాదం జరిగిన సమయంలో ఎలాంటి వాతావరణం ఉందో సరిగ్గా అలాంటి వాతావరణాన్ని రిఫ్రిజిరేటర్ గోడలు సృష్టిస్తాయి. మొత్తానికి మనల్ని.. నిజంగా ఆ ప్రమాదంలో బాధితులుగా భ్రమింపజేస్తారట. అయితే ప్రస్తుతానికి ఈ 'ఎక్స్ పీరియన్స్ టైటానిక్'మ్యూజియం ఇంకా నిర్మాణ దశలోనే ఉంది. 2018లో అందుబాటులోకి వస్తుందట.