నేపాల్ భూకంపం: నెలముందే హెచ్చరిక, ఖాట్మాండ్ అతి ప్రమాద ప్రాంతం
న్యూఢిల్లీ: నేపాల్లో భూకంపం రావొచ్చునని భూకంప అధ్యయన నిపుణులు ముందే హెచ్చరించారు. నేపాల్ను అతలాకుతలం చేసిన భూకంపానికి వారం రోజుల ముందే 50 మంది అంతర్జాతీయ భూకంప అధ్యయన నిపుణులు ఖాట్మాండులో సమావేశమై ప్రకృతి విలయం గురించి ప్రజలను ఎలా రక్షించాలనే విషయం చర్చించిందని తెలుస్తోంది.
పొంచి ఉన్న ప్రమాదం గురించి జియో హజార్డ్స్ ఇంటర్నేషనల్ సంస్థ నెల రోజుల ముందే హెచ్చరించిందని చెబుతున్నారు. నేపాల్ ప్రభుత్వం మాత్రం ప్రాణ నష్టాన్ని అరికట్టలేకపోయింది.
ఖాట్మాండు వ్యాలీ అత్యంత ప్రమాదకర ప్రాంతమని, ఇక్కడి నుండి ప్రతి ఒక్కరిని సురక్షితంగా తరలించడం మినహా మరో మార్గం లేదని నిపుణులు హెచ్చరించారని తెలుస్తోంది. భూకంపాలకు కారణమవుతున్న టెక్నోటిక్ ప్లేట్స్ పైనే నేపాల్ ఉంది. భూకంపాల కారణంగానే ఎవరెస్ట్ ఏర్పడింది.
భూకంపాల వల్ల ఇస్లామాబాదులో నివసిస్తున్న వ్యక్తికన్నా ఖాట్మాండులో నివసించే వ్యక్తికి 9రెట్ల ప్రాణాపాయం, టోక్యోలో నివసిస్తున్న వ్యక్తి కన్నా 60 రెట్లు, తాష్కెంటులో ఉన్న వారికన్నా 30 రెట్ల ప్రాణాపాయం ఉంటుంది.
నేపాల్ మొత్తం పర్వాతలమయం కావడంతో, ప్రజలను తరలించడం మినహా మరో మార్గం లేదని అంతర్జాతీయ నిపుణులు ప్రభుత్వానికి చెప్పారని తెలుస్తోంది. ప్రజల్ని తరలించడం విషయమై పక్కన పెడితే, నిపుణుల సూచనల మేరకు ప్రాణనష్టం ఏమేరకు తగ్గించిందనే విషయం తర్వాత తెలుస్తుంది. భారీ భూకంపం నేపథ్యంలో ఖాట్మాండులో భవిష్యత్తులో భూకంపాలను తట్టుకొని నిలబడే ఇళ్లను నిర్మించుకోవాల్సి ఉంటుంది.