చిక్కుల్లో మోడీ ప్రభుత్వం: పడవను ఎవరు పేల్చారని పాక్ ప్రశ్న
ఇస్లామాబాద్: అరేబియా సముద్రంలో పడవ పేల్చివేత అంశం తాజా దుమారం పాకిస్తాన్కు భారత్పై విమర్శలు చేయడానికి అవకాశం కల్పించింది. పడవ పేల్చివేతకు, అందులోని నలుగురు వ్యక్తుల మృతికి కారణం ఎవరో చెప్పాలని పాకిస్తాన్ భారత్ను అడిగింది. "డిసెంబర్ 31వ తేదీ రాత్రి సంఘటన మీకు గుర్తుండే ఉంటుంది. ఆ రోజు రాత్రి నేను గాంధీనగర్లో ఉన్నాను. పాకిస్థాన్ పడవ విషయం నా దృష్టికి వచ్చిన వెంటనే.. దాన్ని పేల్చేయాలని ఆదేశించాను. వారిని పిలిచి బిర్యానీ పెట్టాలని మేం భావించలేదు" అని బికె లోషాలి వ్యాఖ్యానించినట్లుగా ఆ వీడియోలో ఉన్నది.
బికె లోషాలి ప్రకటన నేపథ్యంలో పాకిస్తాన్ భారత్ను తప్పు పడుతోంది. కావాలనే పడవను లక్ష్యం చేసుకుని భారత్ దాడి చేసిందని విమర్శించింది. కరాచీ నుంచి పేలుడు పదార్థాలతో వస్తున్నట్లు భావించిన పాకిస్థాన్ పడవ పోరుబందర్కు 365కిలోమీటర్ల దూరంలో ఉండగా భారత తీర రక్షణ దళం (కోస్ట్గార్డ్) గుర్తించినట్లు, దీంతో వెంటనే పడవలోని వ్యక్తులే దాన్ని పేల్చేసుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
ఈ సంఘటన ద్వారా భారత్ మరోసారి తన క్రూరమైన ముఖాన్ని, కుట్రను ప్రదర్శించిందని పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖావాజా ఆసిఫ్ అన్నారు. భారత్ మరోసారి అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించిందని, మానవతా పరిగణనలను విస్మరించిందని ఆయన అన్నారు. వచ్చే నెలలో ఇరు దేశాల విదేశాంగ కార్యదర్శులు చర్చలు చేపట్టనున్న నేపథ్యంలో ఈ వివాదం ముందుకు వచ్చింది.
అయితే, పాకిస్థాన్ పడవను తామే పేల్చామంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో కోస్ట్గార్డ్ డీఐజీ లోషాలి యూటర్న్ తీసుకున్నారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. నా వ్యాఖ్యలు వక్రీకరణకు గురయ్యాయని, ఎటువంటి దేశ విద్రోహ శక్తులనూ తీర భద్రతను దాటనివ్వబోమని, వారిని ఆహ్వానించి బిర్యానీ పెట్టబోమని మాత్రమే తాను అన్నానని లోషాలి స్పష్టం చేశారు.