ఉగ్రవాదులను తయారు చేస్తోన్న పాక్ మాజీ సైనికొద్యోగులు, ఐఎస్ఐ మాజీ ఏజెంట్లు: బట్టబయలు చేసిన ఇటాలియన్
రోమ్: ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలతో తమకు ఎలాంటి సంబంధాలు లేవంటూ పాకిస్తాన్ చేస్తోన్న ప్రకటనలు బూటకమని తేలింది. ఆ దేశానికి చెందిన కొందరు మాజీ సైనిక ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన ఐఎస్ఐ ఏజెంట్లు ఉగ్రవాదులను తయారు చేస్తున్నారు. ఉగ్రవాద తయారీలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. దగ్గరుండి మరీ ఆత్మాహూతి దళాన్ని తయారు చేస్తున్నారనే విషయాన్ని ఇటలీకి చెందిన ఓ సీనియర్ మహిళా జర్నలిస్ట్ బట్టబయలు చేశారు. చాలామంది ఐఎస్ఐ ఏజెంట్లు, పాకిస్తాన్ మాజీ సైనిక ఉద్యోగులు పదవీ విరమణ చేసిన తరువాత జైషె మహమ్మద్ ఉగ్రవాద శిబిరంలో శిక్షకులుగా పని చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించారు. తనకు అత్యంత విశ్వసనీయంగా, ప్రత్యక్ష సాక్షుల నుంచి తనకు అందిన సమాచారం ఆధారంగా ఈ కథనాన్ని రాస్తున్నట్లు పేర్కొన్నారు. ఆమె జర్నలిస్ట్ పేరు ఫ్రాన్సిస్కా మెరీనో. దక్షిణాసియా రాజకీయాలు, సమకాలీన స్థితిగతులపై ఆమెకు మంచి పట్టు ఉంది. అత్యంత కీలక సమాచారాన్ని సేకరించగల నైపుణ్యం ఉంది.
కిందటి నెల 26వ తేదీ తెల్లవారు జామున భారత వైమానిక దళ దాడుల అనంతరం.. జైషె మహమ్మద్ ఉగ్రవాద శిక్షణా శిబిరంలో పెద్ద ఎత్తున కలకలం చెలరేగింది. కొద్దిసేపటి తరువాత బాలాకోట్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రులకు చెందిన కొన్ని అంబులెన్స్ లు శిబిరం వద్దకు చేరుకున్నాయి. సుమారు 35 మృతదేహాలను అంబులెన్స్ లో ఎక్కించే దృశ్యాన్ని నేను కళ్లారా చూశాను.. అని ప్రత్యక్ష సాక్షి ఒకరు తనకు వెల్లడించినట్లు ఫ్రాన్సిస్కా పేర్కొన్నారు.
హతుల్లో 12 మంది స్థానికులతో పాటు కొందరు పాకిస్తాన్ మాజీ సైనిక ఉద్యోగులు కూడా ఉన్నట్లు తేలిందని చెప్పారు. బాంబు దాడి చోటు చేసుకున్న వెంటనే బాలాకోట్ పట్టణానికి చెందిన పలువురు ప్రభుత్వ, వైద్య సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకున్నారని, అప్పటికే అక్కడికి చేరుకున్న పాకిస్తాన్ సరిహద్దు జవాన్లు వారి వద్ద నుంచి సెల్ ఫోన్లను లాక్కుని మరీ శిబిరంలోనికి పంపించారని పత్ర్యక్ష సాక్షిని ఉటంకిస్తూ ఫ్రాన్సిస్కా కథనాన్ని రాశారు.
పదవీ విరమణ తరువాత ఉగ్రవాద శిక్షణలో ఐఎస్ఐ, పాక్ ఆర్మీ ఉద్యోగులు..
పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) మాజీ అధికారి ఒకరు ఈ దాడుల్లో హతమయ్యారు. ఆయనను స్థానిక ప్రజలు `కల్నల్ సలీమ్` పిలుస్తారట. ఆయనతో పాటు పెషావర్ కు చెందిన ముఫ్తీ మొయీన్ అనే వ్యక్తి చనిపోయారని, అతను జైషె మహమ్మద్ ఉగ్రవాద సంస్థలో శిక్షకుడిగా పని చేస్తున్నాడని వెల్లడైంది. ఐఈడీ పేలుడు పదార్థాలను తయారు చేయడంలో నిష్ణాతుడైన ఉస్మాన్ ఘనీ కూడా హతమైనట్లు తేలింది. వారితో పాటు కల్నల్ జకర్ జక్రీ తీవ్రంగా గాయపడ్డారు. చెక్కతో తయారు చేసిన ఓ తాత్కాలిక కట్టడం.. బాంబుల దాడికి నేలమట్టమైందని, అందులో నిద్రిస్తున్న 12 మంది ఉగ్రవాద శిక్షకులు మరణించారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించినట్లు ఫ్రాన్సిస్కా రాశారు.
ప్రత్యక్ష సాక్షుల వేర్వేరు వాదనలు
ప్రత్యక్ష సాక్షులు ఇచ్చిన కొంత సమాచారంలో విభిన్న వాదనలు ఉన్నాయి. బాలాకోట్ సమీపంలోని జబా శిఖర ప్రాంతంలో జైషె మహమ్మద్ ఉగ్రవాదులు ఉన్నట్లు కొందరు చెబుతున్నారని, మరికొందరు లేరని ఖండిస్తున్నట్లు ఫ్రాన్సిస్కా చెప్పుకొచ్చారు. వైమానిక దాడుల వల్ల కొంతమంది స్థానికులు మాత్రమే స్వల్పంగా గాయపడినట్లు స్థానిక ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా ప్రతినిధులకు సమాచారం ఇచ్చారని ఆయన అంటున్నారు. వైమానిక దళ దాడి చోటు చేసుకున్న కొన్ని గంటల వ్యవధిలో వారు మీడియాకు సమాచారం ఇవ్వడం వల్ల అందులో సమగ్రత లోపించి ఉంటుందని తాను అభిప్రాయపడుతున్నట్లు ఫ్రాన్సిస్కా అభిప్రాయపడ్డారు.
నాలుగు టార్గెట్లు ధ్వంసం..
బాలాకోట్ సమీపంలోని జబా పర్వత సానువుల్లో కొనసాగుతున్న జైషె మహమ్మద్ ఉగ్రవాద శిబిరానికి చెందిన నాలుగు టార్గెట్లను వైమానిక దళం ధ్వంసం చేసినట్లు భారత అధికారులు వెల్లడించారు. రాడార్ డేటా విశ్లేషణతో ఈ విషయం స్పష్టమైందని అన్నారు. జైషె మహమ్మద్ కు చెందిన కొన్ని శాశ్వత కట్టడాలు నేలమట్టం అయ్యాయని చెప్పారు. తాము దీనికి సంబంధించిన ఫొటోలను బహిర్గతం చేయలేమని వారు చెబుతున్నట్లు సమచారం.
`రా` కూడా అదే చెబుతోంది..
మనదేశానికి చెందిన రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) కూడా దాదాపు ఇదే విషయాన్ని ధృవీకరిస్తోంది. బాలాకోట్ సమీపంలోని జబా పర్వత శ్రేణుల్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలపై దాడి సందర్భంగా కనీసం 20 మంది అయినా మరణించి ఉండొచ్చని `రా` వెల్లడించింది. అనుకున్న ప్రకారమే దాడులు కొనసాగాయని, వైమానిక వింగ్ కమాండర్లు జార విడిచిన బాంబులు దాదాపు లక్ష్యాన్ని ఛేదించాయని రా అంచనా వేసింది. హతమైన వారి సంఖ్యలో స్వల్పంగా హెచ్చు, తగ్గులు ఉండొచ్చిన అభిప్రాయపడింది.
ఆస్ట్రేలియా నిపుణుడి వాదన భిన్నం..
వైమానిక దాడుల్లో 300 నుంచి 350 మంది జైషె మహమ్మద్ ఉగ్రవాదులు హతమైనట్లు భారత్ చెప్పుకొంటున్న వాదనకు సంబంధించినంత వరకు సరైన సాక్ష్యాధారాలు లేవని ఆస్ట్రేలియాకు చెందిన నాథన్ రూజర్ అనే నిపుణుడు చెబుతున్నాడు. ఆ దేశానికి చెందిన ప్రతిష్ఠాత్మక స్ట్రాటజిక్ పాలసీ ఇన్ స్టిట్యూట్ లో ఆయన పని చేస్తున్నారు. ఉపగ్రహాలు పంపించిన ఫొటోలను విశ్లేషించడంలో నిష్ణాతుడిగా ఆయనకు పేరుంది.