యూజర్ల ఫోటోలు, వ్యక్తిగత సందేశాలపై ఫేస్బుక్ నిఘా, కోర్టులో పిటిషన్
శాన్ప్రాన్సిస్కో: యూజర్ల డేటాను దుర్వినియోగం చేసిందనే విషయమై ఫేస్బుక్ ఇప్పటికే తీవ్ర వివాదాలను ఎదుర్కొంది. అయితే తాజాగా మరోకటి ఇదే తరహ వ్యవహరం వెలుగు చూసింది. ఖాతాదారుల వ్యక్తిగత సందేశాలు, ఫోటోలపై ఫేస్బుక్ నిఘా పెట్టిందని పలు రకాల యాప్ల ద్వారా యూజర్ల సమాచారాన్ని సేకరిస్తోందని ఫేస్బుక్పై కోర్టులో పిటిషన్ దాఖలైంది.
కాలిఫోర్నియాకు చెందిన సిక్స్ 4 త్రీ అనే అంకుర సంస్థ ఫేస్బుక్ యూజర్ల వ్యక్తిగత సందేశాలను, ఫోటోలపై నిఘా పెట్టిందని పిటిషన్ దాఖలు చేసింది. తన యాప్స్ ద్వారా యూజర్లు, వారి స్నేహితుల ఫోటోలు తీసుకోవడం, సందేశాలను చదువుతోందని ఆ పిటిషన్ లో ఆ సంస్థ ఆరోపణలు చేసింది.
అంతేకాదు యూజర్లు ఎక్కడ ఉన్నారనే సమాచారాన్ని కూడ సేకరిస్తోందని ఆరోపించింది. ఈ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను కూడ ఆ కంపెనీ కోర్టులో సమర్పించింది.
సిక్స్4 సంస్థ చేసిన ఆరోపణలను ఫేస్బుక్ తీవ్రంగా ఖండించింది. ఖాతాదారుల అనుమతి లేకుండా తాము ఎటువంటి డేటాను తీసుకోబోమని ఫేస్బుక్ ప్రకటించింది. మార్చి మాసంలో యూజర్ల అనుమతి తీసుకొని వాళ్ళ కాల్స్ సందేశాలకు సంబందించిన సమాచారాన్ని తీసుకొన్నట్టు ఫేస్ బుక్ ప్రకటించింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో డొనాల్డ్ ట్రంప్ కోసం పనిచేసిన కేంబ్రిడ్జి అనలిటికా సంస్థ ఫేస్బుక్ నుండి ఖాతాదారుల నుండి సమాచారాన్ని సేకరించిందని ఆరోపణలు ఎదుర్కొంది.
ఈ విషయమై పెద్ద ఎత్తున దుమారం చేలరేగింది. అంతేకాదు ఫేస్బుక్ ఖాతాను డిలీట్ చేయాలంటూ పెద్ద ఎత్తున ఉద్యమం కూడ సాగింది. అయితే యూజర్ల డేటా చోరీకి గురైన విషయాన్ని ఫేస్ బుక్ సీఈఓ జుకర్ బర్గ్ గతంలో ప్రకటించారు. ఈ మేరకు యూజర్లకు క్షమాపణలు కూడ కోరారు.