ఫేస్బుక్ నాదే, తప్పు నాదే, క్షమించండి: కాంగ్రెస్ ఎదుట జుకర్బర్గ్
వాషింగ్టన్: డేటా దుర్వినియోగం అంశంలో ఫేస్బుక్ సీఈవో జుకర్బర్గ్ అమెరికా కాంగ్రెస్ కమిటీ ఎదుట హాజరయ్యారు. ఎప్పుడూ టీషర్ట్, జీన్స్లో కనిపించే ఆయన ఆయన విచారణ నేపథ్యంలో వేషధారణను మార్చారు.
ఎప్పుడూ ధరించే టీషర్ట్, జీన్స్ కాకుండా ముదురు రంగు సూటు, ఊదా రంగు టై కట్టుకొని హాజరయ్యారు. డేటా దుర్వినియోగం కాకుండా నియంత్రించేందుకు ఫేస్బుక్ కానీ, సంస్థ సభ్యులు కాని తగినంత కసరత్తు చేయలేదని అమెరికా కాంగ్రెస్కు వెల్లడించారు. ఇందుకు క్షమాపణలు కోరారు.
తమ బాధ్యతకు సంబంధించి తగినంత విస్తృత దృక్పథాన్ని ఏర్పర్చుకోలేకపోయామని, అది పెద్ద తప్పేనని లిఖితపూర్వకంగా రాసిచ్చారు. ఆయన రెండు మూడు రోజుల పాటు విచారణ ఎదుర్కొంటారు.
డేటా దుర్వినియోగం తన తప్పేనని, అందుకు తాను క్షమాపణలు కోరుతున్నానని, ఫేస్బుక్ను నేనే ప్రారంభించానని, నేనే నడుపుతున్నానని, ఇక్కడ జరుగుతున్నదానికి తనదే బాధ్యత అన్నారు.
భద్రత అంశంలో ఫేస్బుక్ భారీగా పెట్టే పెట్టుబడుల వల్ల సంస్థ లాభాలపై ప్రభావం పడుతుందన్నారు. సంస్థలో 15వేల మంది భద్రత, కంటెంట్ సమీక్షపై పని చేస్తున్నారని, ఈ ఏడాది చివరి నాటికి ఆ సంఖ్య 20వేలకు చేరుతుందని, లాభాలను గరిష్ఠం చేసుకోవడం కన్నా మన సమాజాన్ని రక్షించుకోవడమే ముఖ్యమని జుకర్బర్గ్ కాంగ్రెస్ సభ్యులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ప్రజలను కలపడం, కమ్యూనిటీని బిల్డ్ చేయడం, ప్రపంచాన్ని ఒక్కదగ్గరకు తీసుకు రావడమే తమ లక్ష్యమని చెప్పారు.
అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యాన్ని గుర్తించి ప్రతిస్పందించడంలో ఫేస్బుక్ చాలా నిదానంగా ఉందన్నారు. లోపాలను అధిగమిస్తామన్నారు. అయితే, అందుకు కొంత సమయం తీసుకుంటుందన్నారు.