డేటాపై థర్డ్ పార్టీల ప్రమేయం: ఫేస్బుక్కు భారీ జరిమానా
బెర్లిన్: ఖాతాదారుల డేటాను ఎలా వినియోగించుకుంటున్నారో తెలిపేందుకు నిరాకరించడంతో సోషల్ మీడియా వెబ్సైట్ ఫేస్బుక్పై జర్మనీ కోర్టు భారీ జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే.... ఫేస్బుక్ వాల్పై ఖాతాదారులు పోస్టు చేస్తున్న ఉపయోగకరమైన అంశాలను ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో వారికి తెలియజేయాలని జర్మనీ కోర్టు ఫేస్బుక్ను ఆదేశించింది.
అయితే ఇందుకు నిరాకరించడంతో బెర్లిన్ రిజినల్ కోర్టు ఫేస్బుక్కు 1.09 లక్షల డాలర్లు (సుమారు రూ. 74 లక్షలు) జరిమానా విధించిందని వినియోగదారుల హక్కుల సంస్థ ఒకటి తెలిపింది. ఫేస్బుక్ ఖాతాదారుల డేటా పరిరక్షణ విషయంలో జర్మనీలో గత కొంతకాలంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కోర్టు ఈ తీర్పును వెలువరించడం అక్కడ ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఫేస్బుక్ పై జర్మనీలో వ్యతిరేకత పెరుగుతోంది. దీనిని దృష్టిలో ఉంచుకొనే గతవారం ఫేస్బుక్ స్థాపకుడు మార్క్ జుకర్బర్గ్ జర్మనీలో పర్యటించారు. యూజర్ల మేధోసంపత్తి పరిరక్షణలో ఫేస్బుక్ కచ్చితమైన చర్యలు తీసుకోవడం లేదని మార్చి 2012లో జర్మనీ కోర్టు పేర్కొన్న సంగతి తెలిసిందే.
అంతేగాదు జర్మనీ, యూరప్లో వినియోగదారుల చట్టాలను ఫేస్బుక్ పాటించడం లేదని జర్మనీ వినియోగదారుల హక్కుల ఫెడరేషన్ (వీజెడ్బీవీ) మొదట నుంచి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. వినియోగదారులకు చెందిన ఫోటోలు, వీడియోలను ఫేస్బుక్ థర్డ్ పార్టీ వారికి లైసెన్స్గా ఇస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.