ఫేస్బుక్ కీలక నిర్ణయం... ఇకపై ఆ రికమండేషన్స్ ఉండవు... వెల్లడించిన మార్క్ జుకర్బర్గ్...
ఇకపై ఫేస్బుక్ ఎటువంటి పొలిటికల్ గ్రూప్స్ను రికమండ్ చేయబోదని ఆ సంస్థ సీఈవో మార్క్ జుకర్బర్గ్ వెల్లడించారు. గతేడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలకు నెల రోజుల ముందు అక్కడ ఫేస్బుక్ తాత్కాలికంగా ఈ చర్యలు తీసుకుంది. ఇప్పుడవే చర్యలను ప్రపంచవ్యాప్తంగా అమలుచేసేందుకు సిద్దమైంది. అంతేకాదు,యూజర్స్ న్యూస్ ఫీడ్లో పొలిటికల్ కంటెంట్ను తగ్గించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. బుధవారం (జనవరి 27) ఫేస్బుక్కి సంబంధించిన ఓ కాన్ఫరెన్స్ సందర్భంగా జుకర్బర్గ్ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఫేస్బుక్-భజరంగ్దళ్ వివాదం.. నిలదీసిన పార్లమెంటరీ ప్యానెల్.. ఒకవేళ ఆ ఆర్టికల్ ఫేక్ అయితే..?
ఫేస్బుక్ విద్వేష గ్రూపులను పెంచి పోషిస్తోంది.. : సెనేటర్
ఇదే విషయంపై డెమోక్రాటిక్ సెనేటర్ ఎడ్ మార్కే మంగళవారం(జనవరి 26) జుకర్బర్గ్కు లేఖ రాశారు. గతేడాది అక్టోబర్ నుంచి ఫేస్బుక్లో పొలిటికల్ గ్రూప్స్ రికమండేషన్స్ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన జుకర్బర్గ్... దాన్ని అమలుచేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. అంతేకాదు,ఫేస్బుక్ విద్వేష గ్రూపులను పెంచి పోషిస్తోందని... ఆ వేదికలే జనవరి 6న క్యాపిటల్ భవనంపై దాడికి కారణమయ్యాయని ఆరోపించారు.
అల్గారిథమ్ మార్చాలని...
నిజానికి పలు నిఘా సంస్థలు కూడా ఫేస్బుక్ గ్రూప్స్ వ్యవహారంపై గతంలోనే హెచ్చరికలు చేశాయి. గ్రూప్స్ రికమండేషన్కు సంబంధించి ఫేస్బుక్ తమ అల్గారిథమ్ను మార్చాలని ఒత్తిడి చేశాయి. ఫేస్బుక్ గ్రూప్స్ తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి,తీవ్రవాద కార్యకలాపాలను ప్లాన్ చేయడానికి అడ్డాగా మారాయని విమర్శించాయి. ఒక్క అమెరికాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్ వ్యవహారం వివాదాస్పదంగానే ఉంది. భారత్లో తమ వ్యాపార ప్రయోజనాలను కాపాడుకునేందుకు అధికార పార్టీ నేతల విద్వేష పోస్టులను చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తోందన్న విమర్శలున్నాయి.
Recommended Video
భారత్లోనూ వివాదాస్పద వైఖరి..
భారత్ లో ఫేస్బుక్ సంస్థ 2011 నుంచి బీజేపీకి అనుకూలంగా, ప్రజల్ని ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నదని ప్రఖ్యాత వాల్ స్ట్రీట్ జనరల్ ప్రచురించిన కథనాలు సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. దేశంలో ఫేస్బుక్ వినియోగదారుల డేటా భద్రతకు సంబంధించిన అంశంపై విచారణలో భాగంగా ఆ సంస్థ భారత్ హెడ్ అజిత్ మోహన్ గతంలో ఎంపీ శశి థరూర్ నేత్రుత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ముందు హాజరయ్యారు.
ఆ సందర్భంగా ఫేస్బుక్ పాలసీపై కమిటీ అజిత్ మోహన్కు పలు ప్రశ్నలు వేసింది. ఫేస్బుక్ వేదిక పారదర్శకంగా పనిచేస్తోందని... ప్రతీ ఒక్కరూ తమ భావాలను వెల్లడించే స్వేచ్చను ఇస్తుందని ఆ సందర్భంగా అజిత్ మోహన్ వెల్లడించారు. ఇకముందు కూడా తాము అలాగే పనిచేస్తామని తెలిపారు.