ఫేస్బుక్, ట్విట్టర్లపై ట్రంప్ ప్రతీకారం- నిష్పాక్షికత నిరూపించుకోవాలని సెనేట్ సమన్లు...
హోరాహోరీగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఇప్పుడు ఆ దేశం నుంచే పనిచేస్తున్న సామాజిక దిగ్గజాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. ఎన్నికల సమగ్రత, ఫలితాల విషయంలో సామాజిక దిగ్గజాలు ఫేస్బుక్, ట్విట్టర్ అనుసరిస్తున్న ధోరణులపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో తమ నిష్ఫాక్షిత నిరూపించుకోవాలని అమెరికన్ కాంగ్రెస్ నుంచి ఆయా సంస్ధల సీఈవోలకు సమన్లు వచ్చాయి.
వైట్హౌస్ రేసులోనే ట్రంప్- ఇంకా దారులు తెరిచే ఉన్నాయా ? వాస్తవమేంటి ?
అమరికన్ కాంగ్రెస్లోని సీనియర్ రిపబ్లికన్ సెనేటర్లు ట్రంప్ నిరాధారమైన ఎన్నికల అక్రమాల ఆరోపణలను తిరస్కరించడానికి ఇప్పటికీ నిరాకరిస్తున్నారు. దీనిపై సోషల్ మీడియాలో భిన్న ప్రచారాలు సాగుతున్నాయి. అదే సమయంలో బైడెన్ గెలుపుకు సంబంధించి కూడా సామాజిక మాధ్యమాల్లో పలు వాదనలు చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో ఏది నిజమో ఏది అబద్ధమో కూడా నిర్ధారించుకోలేని పరిస్ధితి. దీంతో ట్రంప్కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో సాగే ప్రచారాలను ప్రోత్సహిస్తున్నారనే కారణంతో ఫేస్బుక్, ట్విట్టర్ సీఈవోలను తమ ముందు హాజరై వాదనలు వినిపించాలని సెనేట్ జ్యుడిషియరీ కమిటీ సమన్లు ఇచ్చింది. అయితే ఈ కమిటీకి నేతృత్వం వహిస్తున్నసెన్ లిండ్సే బహిరంగంగానే ట్రంప్కు మద్దతు ప్రకటిస్తుండటం విశేషం. ఎట్టిపరిస్ధితుల్లోనూ ఓటమిని అంగీకరించవద్దని, బహిరంగంగా పోరాడాలని ఆయన ట్రంప్కు పిలుపునిచ్చారు.
అమెరికా ఎన్నికల విషయంలో విదేశీ జోక్యం లేకుండా చూస్తామని, ఎన్నికల ఫలితాలపై హింస చెలరేగకుండా తమ వంతు ప్రయత్నాలు చేస్తామని ఫేస్బుక్ సీఈవో జుకర్బర్గ్, ట్విట్టర్ సీఈవో జాక్ జోర్సీ అమెరికా చట్టసభ సభ్యులకు హామీ ఇచ్చారు. ఈ హామీని నిలబెట్టుకునే ప్రయత్నంలో వీరు ట్రంప్ ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది. ఎన్నికల సందర్భంగా ఓటింగ్ అక్రమాలంటూ, తాను గెలిచాలంటూ ట్రంప్ చేసిన పలు ట్వీట్లను ట్విట్టర్ తప్పుడు సమాచారం పేరుతో తమ ప్లాట్ఫామ్స్ నుంచి తొలగించింది. ఫేస్బుక్ కూడా ట్రంప్కు మద్దతుగా ప్రచారం చేస్తున్న మూడున్నర లక్షల మందితో కూడిన "స్టాప్ ద స్టీల్" గ్రూప్ను తమ నెట్వర్క్ నుంచి తొలగించింది. దీంతో ఆగ్రహంగా ఉన్న ట్రంప్ తనకు మద్దతున్న సెనేట్ సాయంతో వీరికి సమన్లు ఇప్పించినట్లు తెలుస్తోంది.