వేటుపడింది: పారదర్శకత చట్టాన్ని ఉల్లంఘించిన ఫేస్బుక్..భారీ జరిమానా విధించిన ప్రభుత్వం
జర్మనీ: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్కు జర్మనీలో భారీ జరిమానా విధించడం జరిగింది. జర్మనీలో ఉన్న ఇంటర్నెట్ పారదర్శకత చట్టం ప్రకారం ఫేస్బుక్లో షేర్ అయిన చట్ట విరుద్ధమైన సమాచారం ఇవ్వనందుకు యాజమాన్యానికి 2.3 మిలియన్ డాలర్లు భారీ జరిమానా విధించింది ప్రభుత్వం. ఇప్పటి వరకు తప్పుడు సమాచారం ఫేస్బుక్లో షేర్ అయ్యిందంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు చట్టప్రకారం ఆ సమాచారంను ఇవ్వాల్సిందిగా యాజమాన్యాన్ని కోరగా పట్టించుకోలేదని... అందుకే జరిమానా విధించినట్లు జర్మనీ ఫెడరల్ ఆఫీస్ ఆఫ్ జస్టిస్ కార్యాలయం తెలిపింది. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రజల్లో సోషల్ మీడియా పై తప్పుడు సంకేతాలు వెళతాయని కార్యాలయం పేర్కొంది.
ప్రతి ఆరునెలలకు ఒక సారి జర్మనీలోని సోషల్ మీడియా సైట్లు తమ పారదర్శకతపై నివేదిక ఇవ్వాల్సిందిగా ఆదేశంలో నెట్స్డీజీ చట్టం ఉంది. పారదర్శకత నివేదికలో సమాచారం ఫేస్బుక్ పూర్తిగా ఇవ్వలేదని చెప్పింది. ఫేస్బుక్పై చట్టవ్యతిరేకత సమాచారం షేర్ అయ్యిందని ఫిర్యాదులు అందాయని అయితే దీనిపై కంపెనీ బాధ్యాతారాహిత్యంతో ప్రవర్తించినందున జరిమానా విధించక తప్పలేదని వెల్లడించింది. ఇదిలా ఉంటే ఫేస్బుక్ ఈ ఆరోపణలపై స్పందించింది. ఇప్పటికే జర్మనీ ప్రభుత్వం అడిగిన వివరాలన్నిటినీ ఇచ్చామని ఆ చట్టంలోనే ఏదో క్లారిటీ లేదని ఫేస్బుక్ చెబుతోంది. దీనిపై పూర్తిగా స్టడీ చేసిన తర్వాత కోర్టును ఆశ్రయిస్తామని ఫేస్బుక్ స్పష్టం చేసింది.
ఫేస్బుక్లో షేర్ అయిన విద్వేషపూరిత ప్రసంగాలను తీసివేయనున్నామని దీనిపై తమ టీమ్ పనిచేస్తోందని ఫేస్బుక్ ప్రతినిధి ఒకరు తెలిపారు. నెట్జ్ డీజీ చట్టాన్ని ఎక్కడా ఉల్లంఘించలేదనే సంపూర్ణ విశ్వాసం తమకు ఉందని చెప్పిన ఆయన... ఇప్పటికే ఆ చట్టంలో ఏదో క్లారిటీ మిస్ అవుతోందని పలువురు నిపుణులు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫేస్బుక్పై భద్రతా పరంగా గట్టి పర్యవేక్షణ ఉంటుందని కేంబ్రిడ్జ్ అనలైటికా స్కాండల్ తర్వాత దీన్ని మరింత పటిష్ట పరిచినట్లు ఫేస్బుక్ ప్రతినిధి తెలిపారు. గతేడాది వినియోగదారుడి సమాచారం భద్రపరచడంలో విఫలమైనందుకు యూకే ప్రభుత్వం 500,000 పౌండ్లు జరిమానా విధించింది. మరోవైపు ఇటలీ కూడా తమ చట్టాలను ఉల్లంఘించినందుకు 1.1 మిలియన్ డాలర్లు జరిమానా విధించింది.